ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 1) ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు 3 వేలకోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిల విడుదలలో జాప్యం చేస్తు్న్నారని ఆరోపిస్తూ.. అందుకు నిరసనగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతోనే సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెట్టడం వలన ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారుతోందని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం చెప్తోంది. ఆస్పత్రుల నిర్వహణ, సిబ్బంది జీతాల చెల్లింపుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ నిర్ణయించిన నేపథ్యంలో.. ఆస్పత్రులలో ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆస్పత్రుల చికిత్స పొందుతున్న వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు భావిస్తున్నాయి. మరోవైపు గతంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా ఉన్న పథకం పేరును ఏపీలోని కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన సంగతి తెలిసిందే. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తు్న్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి నెట్‌వర్క్ ఆస్పత్రులలో నగదు రహిత చికిత్సలు అందిస్తున్నారు. ఇన్‌పేషెంట్ చికిత్సలో పాటుగా.. ఆపరేషన్ల తర్వాత కూడా వైద్య చికిత్సలు అందిస్తారు.ఈ పథకం కింద కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకూ నగదు రహిత చికిత్సలు అందిస్తారు. అయితే నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్‌లో ఉంచారనే కారణంతో.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం వీరితో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి.