'కిలిమంజారో' శిఖరాన్ని అధిరోహించిన యువతి.. కూటమి ప్రభుత్వంపై అభిమానంతో..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి సత్తా చాటింది. డిగ్రీ చదువుతుండగానే.. టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. 19ఏళ్ల వయసులోనే శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పర్వతంపై భారత పతాకంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఉన్న అభిమానాన్ని కూడా చాటుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలు ఉన్న బ్యానర్ ప్రదర్శించింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం దుగ్గుమర్రికి పెద్దన్న, నారాయణమ్మ దంపతుల కూమార్తె.. కె కుసుమ. ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ 14న 5,895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో కుసుమకు.. కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన పర్యటన గురించి వివరాలు వెల్లడించింది కుసుమ. యూట్యూబ్‌లో చూసి..యూట్యూబ్‌లో చాలా మంది పర్వతారోహకులు చూశానని కుసుమ చెప్పింది. "యూట్యూబ్‌లో చూసి నేను కూడా అలా చేయాలని అనుకున్నాను. అయితే అది నా వల్ల అవుతుందో లేదో అన్న సందేహం కలిగింది. కానీ అనుకోకుండా కిలిమంజారో అధిరోహించే అవకాశం వచ్చింది. దీంతో నవంబరు 8న ఆఫ్రికాకు బయలుదేరాము. పర్వతం ఎక్కేటప్పుడు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. వాటన్నింటినీ అధిగమించి.. కిలిమంజారో పర్వతం అధిరోహించడం ఎంతో అద్భుతంగా ఉంది. మా కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సహకారంతో పాటు వారు ఇచ్చిన ప్రోత్సాహం.. నేను ఈ ఘనత సాధించేలా చేశాయి" అని కె కుసుమ వెల్లడించింది. ఎమ్మెల్యే అభినందనలు..పర్వతారోహణపై ఆసక్తితో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు కుసుమ తెలిపింది. తన సొంత ఖర్చులతోనే ఆఫ్రికాకు వెళ్లినట్లు కుసుమ వెల్లడించింది. ఈ ఘనత సాధించిన కుసుమను శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీ అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.9 ఏళ్ల వయసులో..గతంలో కూడా ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా రిత్వికశ్రీ రికార్డులకెక్కడం గమనార్హం. కాగా ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.