రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ్ముడి కులాంతర వివాహానికి సహకరించాడనే పగతో.. యువతి బంధువులు అన్నను కిరాతకంగా కొట్టి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షాద్‌నగర్‌లోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో.. పెద్దల నుంచి అభ్యంతరం వస్తుందని భావించి సుమారు 10 రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు.అయితే, ఈ ప్రేమ వివాహం విజయవంతం కావడానికి చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ సహకరించాడని యువతి బంధువులు తీవ్రంగా కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో యువతి బంధువుల్లోని నలుగురు వ్యక్తులు రాజశేఖర్‌ను సంప్రదించారు. మాట్లాడి, రాజీ కుదుర్చుకుందామని నమ్మబలికి అతన్ని గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే అతన్ని మాటలతో బెదిరించడం ప్రారంభించి అనంతరం తీవ్రంగా కొట్టారు. రాజశేఖర్ ప్రతిఘటించినప్పటికీ నలుగురు కలిసి అతన్ని దారుణంగా కొట్టి చంపారు.రాజశేఖర్ మరణించాడని నిర్ధారించుకున్న అనంతరం, సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు దుండగులు అతని మృతదేహాన్ని కారులో తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మనగండ్ల గేట్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ పెట్రోల్ పోసి పూర్తిగా తగులబెట్టారు. రాజశేఖర్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు వెంటనే షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రితో పాటు ఈ కుట్రలో పాల్గొన్నట్లు అనుమానం ఉన్న పలువురి పేర్లను పోలీసులకు అందించారు.పోలీసులు వెంటనే అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను ట్రాక్ చేయగా.. హత్య, మృతదేహం దహనం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాద్‌నగర్ పోలీసులు హత్య, సాక్ష్యాలు మాయం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన యువతి తండ్రితో సహా నలుగురు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.