శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు పాలకమండలి తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయం డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో.. ఛైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షతన ఈవో ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తలు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించారు.. వాటిలో 11 అంశాలను ఆమోదించారు. రెండు అంశాలను వాయిదా వేయగా, ఒక అంశాన్ని తిరస్కరించారు. ముఖ్యంగా, రూ.500 స్పర్శ దర్శనం టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 100 గ్రాముల రెండు లడ్డూలు, రూ.300 టికెట్ కొనుగోలు చేసిన వారికి 100 గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వాలని తీర్మానించారు. శ్రీశైల దేవస్థానం నందికొట్కూరు నియోజకవర్గంలోని కొలనుభారతి అమ్మవారి ఆలయాన్ని దత్తత తీసుకోనుంది. ఈ దత్తత ప్రక్రియ ద్వారా ఆలయ నిర్వహణను దేవస్థానం చేపట్టనుంది. ఈ నిర్ణయంతో పాటు, శ్రీగోకుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. స్థానిక చెంచులకు నెలలో ఒకరోజు శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం, కేంద్ర విచారణ కార్యాలయం (CRO) వద్ద కొన్ని మార్పులు చేయనున్నారు. అక్కడ డిజిటల్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా గదుల లభ్యత, దర్శన టిక్కెట్ల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. భక్తులు తమ సమస్యలను, సూచనలను తెలియజేయడానికి కూడా వీలు కల్పిస్తున్నారు. సీఆర్‌వో కార్యాలయం దగ్గర ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను సులభంగా తెలియజేయగలరు.శ్రీశైలం ఆలయం పాలకమండలి జనవరి 12 నుంచి 18 వరకు శ్రీగిరిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, సర్వదర్శనం క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని బోర్డు నిర్ణయించింది. ఆలయ భద్రత, దళారుల ప్రమేయం లేకుండా టికెట్ల జారీ వంటి అంశాలపై విజిలెన్స్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని పాలకమండలి తీర్మానించింది.