TGSRTC కొత్త ప్రయోగం.. ఇక నుంచి బస్సుల్లో అలాంటి ప్రయాణాలు కుదరవు..!

Wait 5 sec.

బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణాలు, కదులుతున్న బస్సుల నుంచి దిగడం వంటి ప్రమాదకర విన్యాసాలకు అడ్డుకట్ట వేసేందుకు వినూత్న మార్పులు చేపట్టింది. ప్రయాణికుల, ముఖ్యంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్‌ బస్సుల్లో అత్యాధునిక హైడ్రాలిక్‌ ఆటోమెటిక్‌ డోర్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. స్టేజీ వద్ద బస్సు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే ఈ డోర్లు తెరుచుకుంటాయి. బస్సు కదులుతున్నప్పుడు లేదా వేగంగా ఉన్నప్పుడు ఇవి ఆటోమెటిక్‌గా మూసుకుని లాక్ అవుతాయి. దీనివల్ల ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కడం, లేదా ఫుట్‌బోర్డుపై వేలాడటం కుదరదు. ఈ వ్యవస్థ విమానాశ్రయ బస్సులు (ఏసీ ఇంద్ర), హైఎండ్‌ డీలక్స్ బస్సుల్లో ఉండే సాంకేతికత తరహాలో పనిచేస్తుంది.నగరంలో జరిగిన ప్రమాదాలపై ఆర్టీసీ అధికారులు లోతుగా అధ్యయనం చేశారు. ఎక్కువ ప్రమాదాలు ఫుట్‌బోర్డు ప్రయాణాల వల్లే జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న మార్గాలపై దృష్టి సారించారు. ప్రయోగాత్మకంగా హయత్‌నగర్-2 డిపో పరిధిలో 45 'గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్' ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. ప్రస్తుతం 10 బస్సులు ఇప్పటికే రోడ్డెక్కాయి. ముఖ్యంగా విద్యార్థులు అధికంగా ప్రయాణించే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మార్గాల్లో ఈ హైడ్రాలిక్‌ డోర్‌ వ్యవస్థ ఉన్న బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. హకీంపేట కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లు రాగానే.. మిగిలిన 35 బస్సులు కూడా త్వరలో తిరగనున్నాయి. డిసెంబరు నాటికి మరిన్ని ఈ-బస్సులు ఈ మార్గాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కొక్కటి సుమారు 60 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చుని లేదా నిలబడి ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. వీటి ద్వారా ఆక్యుపెన్సీ పెరుగుతుందని డిపో అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – దిల్‍సుఖ్‍నగర్, సికింద్రాబాద్ – ఉప్పల్, కోఠి – రామంతాపూర్, మెహిదీపట్నం – ఆరాంఘర్, ఎల్బీనగర్ – ఇబ్రహీంపట్నం, ఉప్పల్ – ఘట్‌కేసర్ మార్గాల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ కొత్త బస్సులను అత్యధిక సంఖ్యలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా అరికట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త భద్రతా చర్యల వల్ల ఫుట్‌బోర్డు ప్రమాదాలు తగ్గుతాయని.. ప్రయాణం సురక్షితంగా మారుతుందని ఆర్టీసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.