కోల్‌కతా టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమికి కారణాలివే..!

Wait 5 sec.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెంబా బావుమా నేతృత్వంలోని ప్రొటీస్ టీమ్.. భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్‌ను భారత్‌లో టెస్టుల్లో ఓడించిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా టెంబా బవూమా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఓటమికి కారణాలు ఏంటనే విశ్లేషిస్తున్నారు. తేలిపోయిన బ్యాటర్లు..ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లలోనూ 160 పరుగుల లోపే ఆలౌట్ చేశారు. కానీ సమస్యల్లా బ్యాటింగ్‌తోనే వచ్చింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒక్క భారత బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 189 పరుగులు చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 93 పరుగులకే కుప్పకూలిపోయింది.దూకుడుగా ఆడాలనుకొని..భారత జట్టులోని మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు.. ఏమాత్రం ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోయారు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద.. జాగ్రత్తగా ఆడలేకపోయారు. అనవసరమైన దూకుడుకుపోయి.. చెత్త షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. టెస్ట్‌లలో తొలుత ఓపికగా ఆడి, బౌలర్లు అలసటకు గురయ్యేలా చేయాలి. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెప్పి పరుగులు రాబట్టాలి. కానీ ఈ టెస్ట్‌లో మాత్రం భారత బ్యాటర్లు అది చేయలేకపోయారు.స్పిన్నర్లను ఎదుర్కోలేకపోవడంగతంలో భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడేవారు. ద్రవిడ్, పూజారా లాంటి ఆటగాళ్లయితే స్పిన్నర్లకు చుక్కలు చూపెట్టేవారు. కానీ గత కొంత కాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోలేకపోతున్నారు. కోల్‌కతా టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు స్పిన్‌ను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏరికోరి స్పిన్‌ పిచ్‌ను తయారు చేయించుకున్న భారత్.. ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కానీ బ్యాటర్లు మాత్రం అదే స్పిన్‌కు దాసోహమయ్యారు. కెప్టెన్ గిల్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోవడం కూడా భారత్‌పై ఎఫెక్ట్‌ చూపించింది.కొంప ముంచుతున్న ప్రయోగాలు..గత కొంత కాలంగా, ముఖ్యంగా గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక.. చేపడుతున్న ప్రయోగాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌ విషయంలో ప్రయోగాలతో ఫలితాలు తారుమారు అవుతున్నాయి. కీలకమైన మూడో స్థానంలో గతంలో పూజారా లాంటి కీలక ఆటగాళ్లు ఆడేవారు. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేవారు. కానీ ఈ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్‌ను ఆడించడం పట్ల విమర్శలొస్తున్నాయి. కీలక సమయంలో వికెట్లు తీయలేకపోవడం.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. మూడో రోజు ఉదయం చకా చకా వికెట్లు తీస్తే.. భారత్ ముందు 100 పరుగుల్లోపే లక్ష్యం ఉంటుందని భావించారంతా. కానీ భారత బౌలర్లు కీలక తరుణంలో వికెట్లు తీయలేపోయారు. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు బరువైన రోలర్ వాడారేమో కానీ.. సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. ఇలాంటి కఠిన పిచ్‌లపై నిలబడ్డప్పుడే బ్యాటర్ల సత్తా తెలుస్తుంది. ఇందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా మంచి ఉదాహరణ. రెండో ఇన్నింగ్స్‌లో అతడు అజేయ హాఫ్ సెంచరీ (55)తో రాణించాడు. కానీ భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చే కీ ఫ్యాక్టర్ అయింది.