BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అత్యంత చౌకైన ప్లాన్స్ అందిస్తూ మొబైల్ ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ప్రత్యర్థి టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ ఔరా అనిపిస్తోంది. చాలా తక్కువ ధరకే భారీగా డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఇస్తుండడం గమనార్హం. దీంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కి మారిపోతున్నారు. ఇప్పుడు మరోసారి కొత్త తరహా ప్లాన్ ప్రకటించింది. అదే . కేవలం రూ.251తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని చెబుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఈ ప్లాన్ గురించి వివరాలు తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్‌తో చదువుకోండి, వీడియోలు స్ట్రీమింగ్ చేయండి, విజయం సాధించండి అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. బీఎస్ఎన్ఎల్ స్టూటెండ్ స్పెషల్ ప్లాన్ పేరుతో పరిమిత కాల రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.251గా ఈ ప్లాన్ ధరను నిర్ణయించింది. ఈ స్టూడెంట్ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అలాగే 100 జీబీ డేటాతో పాటుగా అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు లభిస్తాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి టెలికాం కంపెనీలు కనీస రీఛార్జ్ ప్లాన్స్‌ రూ.300 పైన ఉంటుండగా నెల రోజుల పాటు రూ.251కే భారీగా డేటా, అపరిమిత కాల్స్ అందిస్తుండడం గమనార్హం. నవంబర్ 14, 2025 రోజున లాంచ్ చేసిన ఈ స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ డిసెంబర్ 14, 2025 వరకే అందుబాటులో ఉంటుంది. ఆ లోపు రీఛార్జ్ చేసుకున్న వారికే 28 రోజుల వ్యాలిడిటీతో 100జీబీ డేటా, అపరిమిత కాల్స్ వస్తాయని చెప్పవచ్చు. పరీక్షల కాలం మొదలవుతున్న క్రమంలో విద్యార్థలకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అవసరమైన మేర డేటా ఉండడంతో మొబైల్ ద్వారా చదువుకునేందుకు వీలుకలుగుతుందని తెలిపింది. మరోవైపు..గత దీపావళికి సైతం రూ.1 ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా సిమ్ ఇవ్వడంతో పాటు 30 రోజుల పాటు వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజు వారీగా 100 ఎస్ఎంఎస్‌లు అందించింది. అయితే, ఇది కొత్తగా సిమ్ కార్డు తీసుకునే వారికే వర్తిస్తుంది. కానీ, ఇప్పుడు ప్రకటించిన స్టూడెంట్ ప్లాన్ చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.