నిర్వాహకుడు ఇమ్మడి రవి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పేరు. ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్ నిర్వహిస్తూ.. సినిమాలను పైరసీ చేశాడని.. దీని ద్వారా కోట్లు ఆర్జించాడని పోలీసులు చెప్తున్నారు. అలాగే ఇమ్మడి రవి కారణంగా సినీ ఇండస్ట్రీకి భారీగా నష్టం జరిగిందని సినీ పెద్దలు పేర్కొంటున్నారు. మీద సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. ఇమ్మడి రవి వద్ద దొరికిన హార్డ్ డిస్కులో 21 వేల సినిమాలు ఉన్నాయని.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల సమాచారం ఉందని తెలిపారు. పైరసీ ద్వారా 20 కోట్లు సంపాదించాడని చెప్పారు. ఇక పైరసీ అంటే ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన లక్షల మంది కష్టం దోచుకోవడమని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇలా సినీ ప్రముఖులు ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ మీద స్పందించారు.అయితే ఐబొమ్మ వలన సినీ ఇండస్ట్రీకి నష్టం లేదంటున్నారు మహాసేన రాజేష్. ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో సుధీర్ఘ పోస్టు పెట్టారు మహాసేన రాజేష్. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పైరసీని అరికట్టామని అనుకోవటం ఎలా ఉందంటే.. టిక్ టాక్‌ని బ్యాన్ చేసి చైనాని ఓడించాం అనుకున్నట్టు ఉందని మహాసేన రాజేష్ సెటైర్లు వేశారు. ఐబొమ్మ వలన నష్టం సినీ ఇండస్ట్రీకా.. ఓటీటీ యాప్స్‌కా అని ప్రశ్నించారు. "కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో కష్టాలు పడి.. సినిమా నిర్మించి థియేటర్లో రిలీజ్ చేసిన వెంటనే అది ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేస్తే ఆ మూవీ నిర్మించినవారికి చాలా నష్టం వస్తుంది. దీనినే పైరసీ అంటారు. ఇలా పైరసీ చేయడం ఖచ్చితంగా నేరం. కానీ ఐబొమ్మ లో వచ్చే సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వచ్చేవి కావు.నాకు తెలిసినంత వరకు థియేటర్లో విడుదల అయ్యి కలెక్షన్లు సంపాదించుకుని కొన్ని రోజుల తరువాత శాటిలైట్ రైట్స్ ఏదో ఒక OTT యాప్‌కి అమ్ముకుని ఆ డబ్బులు కూడా నిర్మాత తీసుకున్నాక.. ఆఫీషియల్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఐబొమ్మలో దర్శనం ఇస్తాయి. దీని వలన నష్టం అంటూ ఉంటే అది కేవలం ఆ ఓటీటీ యాప్ వారికే తప్ప సినిమా ఇండస్ట్రీకి కాదు" అంటూ మహాసేన రాజేష్ పోస్టు పెట్టారు. ఓటీటీ కలెక్షన్లలో కూడా సినిమా నిర్మాతకు షేర్ ఉన్నప్పుడే.. ఆ ప్రొడ్యూసర్‌కు నష్టం జరుగుతుందని.. కానీ ఓటీటీ రైట్స్ ఒకేసారి అమ్మేస్తారు కావు.. సినిమా ఓటీటీలో యాప్‌లో ఉన్నా.. ఐబొమ్మ సైట్‌లో ఉన్నా నిర్మాతకు వచ్చే నష్టం లేదన్నారు మహాసేన రాజేష్. ఓటీటీ వారి కోణంలో ఐబొమ్మ చేసింది తప్పేనని మహాసేన రాజేష్ అన్నారు. అయితే చాలా ఓటీటీ యాప్‌లు సబ్‌స్ర్కిప్షన్‌కి ముందో రేటు పెడుతున్నాయని.. అది చెల్లించిన తర్వాత యాప్‌లోపలికి వెళ్తే నచ్చిన సినిమా చూడటానికి అవకాశం లేకుండా చేస్తున్నాయన్నారు. మళ్లీ సినిమాలకు రెంట్ పెడుతున్నారని.. అప్ గ్రేడ్ కోసం మళ్లీ డబ్బులు అడుగుతున్నారన్నారు. ఈ మధ్యకాలంలో యాడ్స్ కూడా వస్తున్నాయని.. యాడ్స్ వద్దనుకుంటే డబ్బులు అడుగుతున్నారని మహాసేన రాజేష్ పేర్కొన్నారు. ఇది కూడా దోపిడీ, మోసమే కదా అని ప్రశ్నించారు. ఐబొమ్మ చేసింది తప్పే అయితే ఓటీటీ యాప్స్ చేసేది కూడా తప్పేనని మహాసేన రాజేష్ పోస్ట్ చేశారు. మూవీ రూల్జ్ వంటి యాప్స్ కారణంగా సినిమాలు దెబ్బతింటున్నాయని.. థియేటర్లో మూవీ రిలీజ్ ఆయిన నిముషాల్లోనే ఇందులోకి వచ్చేస్తున్నాయన్నారు. సినిమా కలెక్షన్లు పడిపోవడానికి కారణం మూవీ రూల్జ్ అని.. వీలైతే అలాంటి వాటిని అడ్డుకోవాలని మహాసేన రాజేష్ సూచించారు. సరైన లాయర్ ఉంటే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బయటకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఐబొమ్మ ఇమ్మడి రవి వలన పేదలకు తక్కువ ధరకే వినోదం దక్కిందనేది నిజమని.. ఈ నష్టం కేవలం ఓటీటీ యాప్స్‌కే తప్ప సినిమా ఇండస్ట్రీకి మాత్రం కానే కాదంటూ మహాసేన రాజేష్ పోస్ట్ చేశారు.