ఒక్కొక్కరి ఖాతాలో రూ.2000 జమ.. పీఎం కిసాన్ సాయం విడుదల చేసిన ప్రధాని

Wait 5 sec.

: రైతులకు పెట్టుబడి సాయం వచ్చేసింది. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.2000 జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద పెట్టుబడి సాయం విడుదలయింది. ఈ స్కీమ్ కింద 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు.ఒక్కసారిగా రైతుల ఫోన్లు బ్యాంక్ మెసేజ్‌లతో మోగిపోతున్నాయని చెప్పవచ్చు. సాయంత్రం లోపు అందరి ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019 ఫిబ్రవరి 24వ తేదీన ఎన్డీయే సర్కార్ ప్రారంభించింది. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇప్పుడు 21వ విడత కింద రూ. 18000 కోట్లను విడుదల చేశారు. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉండి, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసుకున్న రైతులకు ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయి. ప్రతి ఏడాది రూ. 6000 చొప్పున అందిస్తున్నారు. అయితే, మూడు విడతల్లో రూ. 2000 చొప్పున ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన దాంతో మొత్తంగా 21వ విడతలుగా నిధులు విడుదల అయ్యాయి. స్టేటస్ చెక్ చేసుకోండిలా.. కొందరికి ఆలస్యం కావచ్చు. వారందరూ తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అందుకు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలోని ఫార్మర్ కార్నర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వంటి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. దీంతో బెనిఫిషియరీ లిస్ట్ వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి. ఉంటే ఆలస్యమైనా డబ్బులు వస్తాయి. ఒక వేళ లేకపోతే అందుకు కారణాలు తెలుసుకుని సరి చేయాలి. తదుపరి విడతలో వచ్చే అవకాశం ఉంటుంది.