రెండేళ్లుగా కూతుర్ని గదిలో బంధించిన కన్నతల్లి.. కారణం తెలిసి షాక్, పాపం అమాయకత్వంతో!

Wait 5 sec.

ఆడుతూ పాడుతూ స్కూల్‌కు వెళ్లాల్సిన అమ్మాయి రెండేళ్ల పాటూ నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది. కన్నతల్లి కూతుర్ని ఇలా గదిలో ఉంచి నిర్బంధించింది. పాపం ఆ బాలిక చీకటి గదిలో బిక్కుబిక్కుమంటూ గుడుపుతూ వస్తోంది. ఎట్టకేలకు రెండేళ్ల నరకం తర్వాత ఆ అమ్మాయికి విముక్తి లభించింది. బాలికను గదిలో ఎందుకు బంధించావని అడిగిన స్థానికులకు తల్లి చెప్పిన సమాధానంతో అందరూ షాకయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన చక్రపాణివీధికి చెందిన భాగ్యలక్ష్మికి 2007లో ఒడిశా కటక్‌వాసి నరసింహరాజుతో వివాహం అయ్యింది. భాగ్యలక్ష్మి కాన్పు కోసం ఇచ్ఛాపురం వచ్చింది.. డెలివరీ తర్వాత అక్కడే ఉండిపోయింది. ఆమె భర్త పదేళ్ల క్రితం చనిపోగా.. భాగలక్ష్మి కుమార్తె మౌనికతో కలిసి నివాసం ఉంటోంది. మౌనిక స్థానికంగా ఓ స్కూల్‌లో చదువుతోంది.. అయితే కూతురు పెద్దమనిషి అయ్యాక తల్లి భాగ్యలక్ష్మి చదువును మాన్పించింది. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్లు మౌనికను ఎందుకు స్కూల్‌కు పంపలేదని అడిగితే.. భాగ్యలక్స్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పటి నుంచి కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టనివ్వలేదు. ఇంట్లోకి విద్యుత్ రాకుండా మెయిన్ కూడా ఆపేసింది.. ఇద్దరు చీకట్లోనే ఉంటున్నారు. ఒకవేళ భాగ్యలక్ష్మి పనిపై బయటకు వెళితే.. కూతుర్ని లోపలే ఉంచి తాళం వేసేది. గత రెండేళ్లుగా ఆ బాలిక గదిలోనే ఉంది. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తకు భాగ్యలక్ష్మి తీరుపై అనుమానం వచ్చింది. బాలిక బయటకు రాకపోవడం.. తల్లి ఒక్కరే బయటకు వస్తుండటంతో ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ పీవోకు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఇచ్ఛాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జికి కూడా ఈ సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక తహసీల్దారు, ఎంఈవో, పోలీసులు కలిసి భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మిని కౌన్సిలింగ్ చేసి.. ఇంటి లోపల గదిలో ఉన్న మౌనికను ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. తల్లీకూతుళ్లను తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. బాలిక మంచిచెడులు చూస్తామని ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భాగ్యలక్ష్మి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని గుర్తించి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. కూతుర్ని ఇలా గదిలోకి బంధించడానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. తన కూతుర్ని బయటకు పంపిస్తే ఈ సమాజం ఏం చేస్తుందనే భయంతోనే ఇలా చేసినట్లు చెప్పారట. అప్పటి నుంచి కూతురికి భయం నూరిపోసి.. ఇంట్లోనే ఉంచింది. బాలిక కూడా భయంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది.