భారత జట్టు టెస్టు ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది. కోల్‌కతా టెస్టు ఓటమి తర్వాత టీమిండియాతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలకు దారితీసింది. సొంతగడ్డపై అదీ స్పిన్నర్లను ఎదుర్కొలేక భారత్ ఓటమి పాలవ్వడం మింగుడు పడటం లేదు. ఇప్పటికే పలు మాజీలు తీవ్ర విమర్శలు చేస్తే, తాజాగా ముఖ్యంగా పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్లను టార్గెట్ చేశాడు. టెస్టు ఫార్మాట్‌కు సరిపోయేలా ఈ ఆల్‌రౌండర్లు ఉన్నారా అంటూ పెద్ద ప్రశ్నలే లేవనెత్తాడు. ఇటీవల జరిగిన కొన్ని తాజా సెలెక్షన్స్‌నే గవాస్కర్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడాడు. భవిష్యత్‌లో టీమిండియా టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే టీమ్ సెలెక్షన్స్‌లో మార్పులు రావాలని చెప్పకనే చెప్పాడు. దేశీయ క్రికెట్‌లో భారీగా పరుగులు చేసే బ్యాటర్లను ఎంపిక చేయడంలో మేనేజ్‌మెంట్ ఆలోచించడం వల్లే స్వదేశీ కండీషన్స్‌లో స్పిన్‌కు బలవుతున్నారని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో తరచుగా విదేశీ టూర్లలో పాల్గొంటున్న ఆటగాళ్ల, దేశీయ పిచ్‌లపై ఆడే అవకాశాలు చాలా తక్కువగా రావడంతో స్పిన్, లో బౌన్స్‌ ఎదుర్కోలేకపోతున్నారని చెప్పాడు."దక్షిణాఫ్రికాపై ఓటమితో పూర్తి బాధ్యత వహించాల్సిన టీమ్ మేనేజ్‌మెంట్, ఇప్పటికైనా దేశీయ క్రికెట్‌లో భారీగా పరుగులు చేసే బ్యాటర్ల అవసరాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. విదేశాలల్లో ఆడటంలో బిజీగా ఉండే ప్లేయర్లకు దేశీయ పిచ్‌లపై ప్రాక్టీస్ లేకపోవడం కూడా పెద్ద లోపమే. కొన్ని బంతులు మిస్ అవ్వడం సహజమే.. అందుకే ప్రతీ బంతినీ గాల్లోకి లేపాలని చూడకూడదు. సరైన బంతి వచ్చేంత వరకు వేచి ఉండటమే టెస్టు బ్యాటింగ్ అసలు అర్థం" అని సునీల్ గవాస్కర్ ఒక స్పోర్ట్స్ కాలమ్‌లో రాసుకొచ్చాడు. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సునీల్ గవాస్కర్ పరోక్షంగా టార్గెట్ చేశాడు. గంభీర్, అగార్కర్ ఒక ఆల్‌రౌండర్‌గా సపోర్ట్ ఇస్తున్నారని.. అయితే టెస్టు ఆల్‌రౌండర్ అనే వ్యక్తి ప్లేయింగ్ 11లో ప్యూర్ బ్యాటర్‌గా లేదా ప్యూర్ బౌలర్‌గా ఆడే సామర్థ్యం కలిగి ఉండాలని చెప్పాడు. "కొన్ని ఓవర్లు వేసే, కొన్ని పరుగులు చేసే ఆటగాడు టెస్టు ఆల్‌రౌండర్ కాదు. టెస్టు ఫార్మాట్‌కు అవసరమైన విధంగా ఆడని ప్లేయర్‌తో ఎక్కువ కాలం ప్రయోజనం ఉండదు" అని అన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అటు బ్యాటింగ్ కానీ, ఇటు బౌలింగ్‌లో కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసిన రెడ్డి, ఢిల్లీలో అయితే పూర్తిగా బౌలింగ్‌కే రాలేదు. మొత్తానికి టీమిండియా మేనేజ్‌మెంట్ సరైన విధంగా ఆలోచించకపోతే రానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని సన్నీ హెచ్చరించాడు.