భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే ఏదో ఒక టెన్షన్.. అది సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా సరే! మ్యాచ్ సజావుగా పూర్తయితే చాలు అన్నట్టు ఇప్పుడు పరిస్థితులు ఏర్పడ్డాయి. పేరుతో జరుగుతున్న టోర్నీలో ఆసియాలోని అన్ని దేశాల ఏ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భాగంగా భారత్ ఏ - పాక్ ఏ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ ప్లేయర్ క్లియర్ క్యాచ్‌ని థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం వివాదానికి దారితీసింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన ఈజీ టార్గెట్‌ని పాకిస్తాన్ సునాయాసంగా ఛేదించింది. అయితే పాక్ బ్యాటింగ్ సమయంలో ఓపెనర్ మాజ్ సాదాఖత్ హాఫ్ సెంచరీతో జట్టును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో.. సుయాశ్ శర్మ బౌలింగ్ సిక్సర్‌కి ప్రయత్నించాడు. బౌండరీ వద్ద ఉన్న నేహాల్ వధేరా బంతిని పట్టుకుని.. రోప్ దాటే సమయంలో దాన్ని గాల్లోకి విసిరేయగా అక్కడే ఉన్న నమన్ ధీర్ క్యాచ్ అందుకున్నాడు. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా క్యాచ్ కంప్లీట్ చేయడంతో భారత ఆటగాళ్ల సంబరాల్లో మునిగిపోయారు. అయితే, థర్డ్ అంపైర్ తన రివ్యూలో ఒకటికి రెండు సార్లు దీర్ఘంగా పరిశీలించి.. అనూహ్యంగా దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు. క్లియర్‌గా అవుటైన దాన్ని నాటౌట్ ఎలా ఇస్తారు అంటూ భారత జట్టు కెప్టెన్ జితేశ్ శర్మ వెంటనే ఫీల్డ్ అంపైర్ దగ్గరకు వెళ్లి వాదనకు దిగాడు. దాంతో కాసేపు గ్రౌండ్‌లోనే టెన్షన్ వాతావరణం నెలకొంది. బౌండరీ వద్ద పట్టుకున్న అది క్యాచ్ కాకపోతే సిక్సే అవ్వలి కదా? కానీ అంపైర్ దాన్ని సిక్సర్‌గా కానీ, క్యాచ్‌గా కానీ ఇవ్వకుండా డాట్ బాల్‌గా నమోదు చేశాడు. దాంతో ప్లేయర్లతో పాటు మ్యాచ్ చూస్తున్న వారికి కూడా ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఐసీసీ ప్లేయింగ్ కండీషన్స్‌లోని లా 19.5.2 ప్రకారం ఫీల్డర్ బౌండరీ లోపల నుంచి జంప్ చేసి బంతిని టచ్ చేస్తే, క్యాచ్ అందుకునే సమయంలో కూడా బౌండరీ లోపలే ఉండాలి. ఒకవేళ బౌండరీ లోపల బంతిని గాల్లోకి ఎగరేసి దాన్ని బౌండరీ బయట తీసుకుంటే అది సిక్స్ అవుతుంది. కానీ ఇక్కడ వధేరా బౌండరీ లోపలే బంతిని అందుకుని దాన్ని అటుగా ఉన్న ఫీల్డర్ వైపు విసిరేశాడు. అది క్లియర్‌గా అవుట్ అన్నట్లు స్పష్టం అవుతోంది. కానీ అంపైర్ అటు అవుట్ కానీ, సిక్స్ కానీ ఇవ్వకపోవడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. థర్డ్ అంపైర్ నిర్ణయంతో నాటౌట్‌గా నిలిచిన మాజ్ సాదాఖత్ 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి పాకిస్తాన్‌ను సెమీ ఫైనల్స్‌కి చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 45, నమన్ ధీర్ 35 పరుగులు చేసినా మిగతా ఏ ప్లేయర్ రాణించకపోవడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాకిస్తాన్ జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.