ఆంధ్రప్రదేశ్‌కు అణు విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అగ్రగామి విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 700 మెగావాట్లు, 1000 మెగావాట్లు, 1600 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాలను వెతికే పనిలో ఉన్నారట. 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని 2047 నాటికి సాధించాలనే టార్గెట్ పెట్టున్నారట. ఎన్‌టీపీసీ 30 గిగావాట్ల ఉత్పత్తితో 30% వాటాను సాధించాలని భావిస్తున్నారట. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ) గుర్తించి, అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లోనే నిర్మించనున్నారట. ఒక గిగావాట్ అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.15,000 నుండి రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ప్లాంట్ నిర్మాణం ప్రారంభం నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యే వరకు కనీసం మూడేళ్లు పడుతుందని సంస్థ భావిస్తోందట. ఈ అణు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా దేశ ఇంధన భద్రతను పెంపొందించడంతో పాటు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలనేది ప్రభుత్వ యోచన. ఎన్‌టీపీసీ ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు.ఎన్‌టీపీసీ తన విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడానికి అణు విద్యుత్ ప్లాంట్లపై ఫోకస్ పెట్టింది. ఈ కొత్త ప్లాంట్లకు అవసరమైన యురేనియం వంటి ముడి పదార్థాలను సేకరించడంపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. యురేనియం సేకరణ కోసం విదేశీ మార్కెట్లను కూడా అన్వేషిస్తోంది. ఈ దిశగా, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UCIL)తో ఒక ముఖ్యమైన వాణిజ్య-సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ముడి పదార్థాల సరఫరాలో సహాయపడుతుంది.ఎన్‌టీపీసీ, దేశ విద్యుత్ అవసరాలను తీర్చడానికి, పునరుత్పాదక ఇంధన వనరులతో పాటు అణు విద్యుత్‌ను కూడా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా, రాజస్థాన్‌లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌తో కలిసి సుమారు రూ.42,000 కోట్ల విలువైన ఒక పెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ పూర్తయితే, దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఎన్‌టీపీసీ దేశవ్యాప్తంగా 84,848 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సామర్థ్యంలో బొగ్గు, గ్యాస్, జల విద్యుత్, సౌర విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఎన్‌టీపీసీ తన విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ పూర్తయితే, దేశ విద్యుత్ సరఫరాలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది.