విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కృష్ణా జిల్లా అజ్జంపూడి గ్రామంలో తమ భూములను గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూసమీకరణ పథకం కింద ఇచ్చామని.. అయితే సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం తమకు వార్షిక కౌలు చెల్లించడం లేదని మన్నం కృష్ణమూర్తి, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. పథకం కింద గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని తప్పుపట్టింది హైకోర్టు. భూములను ఒకసారి స్వాధీనం చేసుకున్నాక, వాటిని వాడుకున్నా, వాడుకోకపోయినా కౌలు చెల్లించాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏను ఆదేశించిన న్యాయస్థానం, విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయంలో భూములు ఇచ్చిన ఇతర రైతులకు కూడా కౌలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు గుర్తుచేశారు. పిటిషనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.మరికొన్ని అప్డేట్స్ ఇలా..మరోవైపు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు వీఎల్‌జీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు అప్పగించారు. ఈ మేరకు వారికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఎల్‌జీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు సంస్థకు ఏడాదికి రూ.3.49 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్‌వోఏ జారీ చేయాలని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ మత్స్యకార సంఘం జాతీయ కమిటీ సభ్యులు ఈ నెల 29న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ సమస్యతో పాటు మత్స్యకారుల ఇబ్బందులను పరిశీలించేందుకు నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటను సందర్శించనున్నారు. ఈ నెల 21న సందర్శన ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు రావడం, అనుమతుల ప్రక్రియ పూర్తి చేయడం కోసం 29కి వాయిదా వేశారు. న్యాయ సలహాదారుగా జి.కల్యాణ్‌, సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పుట్టా గురు వెంకటేశ్వర్లును నియమించినట్లు తెలిపారు.