తెలంగాణలో 4 కొత్త హైవేలకు గ్రీన్ సిగ్నల్.. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంపై కీలక అప్డేట్

Wait 5 sec.

తెలంగాణలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టబోయే నాలుగు కీలక జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 271 కిలోమీటర్ల మేర రోడ్లను రూ. 10,034 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. తాజాగా.. ఆర్మూర్‌-జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారుల నిర్మాణానికి NHAI టెండర్లను ఆహ్వానించింది. మహబూబ్‌నగర్‌-గూడెబల్లూర్‌ హైవేకి సంబంధించిన టెండర్లను గత నెలలోనే పిలిచారు. ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ డిసెంబర్ నెలలో ముగియనుందని.. జనవరి లేదా ఫిబ్రవరి 2026 నాటికి నిర్మాణ పనులు ప్రారంభించేలా NHAI ప్రణాళికలు సిద్ధం చేసింది. జగిత్యాల-మంచిర్యాల హైవేని ఈపీసీ (ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో నిర్మించనున్నారు. మిగతా మూడు రహదారులైన ఆర్మూర్‌-జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, మహబూబ్‌నగర్‌-గూడెబల్లూర్‌ హైవేలను హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ హ్యామ్ మోడల్ కింద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లను నిర్మించి, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. జగిత్యాల-కరీంనగర్‌ హైవేని 59 కి.మీ. మేర రూ.2,484 కోట్లతో నిర్మిస్తారు. ఆర్మూర్‌-జగిత్యాల జాతీయ రహదారిని 64 కి.మీ. మేర రూ.2,338 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. జగిత్యాల-మంచిర్యాల హైవేని 68 కి.మీ. మేర రూ.2,550 కోట్లతో నిర్మించున్నారు. మహబూబ్‌నగర్‌- గూడెబల్లూర్‌ వరకు 80 కి.మీ. మేర రూ.2,662 కోట్లతో జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ, రైల్వే వంటి కీలక అనుమతులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. భూసేకరణ ప్రక్రియ కూడా వివిధ దశల్లో వేగవంతం అవుతోంది. ఇక హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తర భాగం పనుల కోసం సవరించిన టెండర్లను కూడా NHAI సిద్ధం చేస్తోంది. గతంలో సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు మొత్తం 161 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారిని రూ. 7,104 కోట్లతో నిర్మించేందుకు టెండర్లను పిలిచారు. అయితే, ట్రాఫిక్‌ సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకుని, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఆరు వరుసలుగా అభివృద్ధి చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఈ మార్పు కారణంగా నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపు అయ్యింది. మొత్తం 160 కి.మీ. మేర ఈ ఆరు వరుసల రహదారిని సుమారు రూ. 15,627 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచిన ఎన్‌హెచ్ఎఐ సవరించిన ఈ ప్రాజెక్టును కూడా ఈసారి హ్యామ్‌ విధానంలో చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనుంది. ఈ కీలక ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడి, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని అంచనా.