ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి, వాటి వివరాలను సేకరిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా, మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను సేకరించి, ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు తమ వివరాలను ఇప్పటికే ఈ పోర్టల్‌లో నమోదు చేశాయి. మరికొన్ని విభాగాలు ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్‌లో పొందుపరిచారు. ఈ వివరాలను ఆయా శాఖల అధిపతులు ధృవీకరించాల్సి ఉంటుంది.ఏపీ ప్రభుత్వ శాఖల్లో ప్రాథమికంగా దాదాపు 30 శాతం వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీలలో కొన్నింటిలో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు, 157 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించారు. ఈ సమాచారం ఆధారంగానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను రూపొందించనుంది. దాదాపు 99వేల వరకు ఖాళీలు నేరుగా నియామకాల (డీఆర్‌)కు వచ్చేవి ఉన్నాయి. 24 విభాగాల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో 21 శాఖల వివరాలు నమోదు చేయడం ప్రాసెస్‌లో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఖాళీల లెక్క తేలుతుందంటున్నారు. నిరుద్యోగ యువతతో నేరుగా నియామకాలకు వచ్చే వాటిని చేస్తారు.. కొన్ని పోస్టులను నిబంధనల ప్రకారం ఇన్‌ సర్వీసు పదోన్నతులతో నింపుతారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో మొత్తం 13 వేల ఖాళీలుంటే, ఏడు హెచ్‌ఓడీలు 4,787 ఖాళీలను గుర్తించారు. వీటిలో 2,552 నేరుగా నియామకాలకు కేటాయించారు. ఉన్నత విద్యా శాఖలో 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో 3 వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసుల సమస్యలు తొలగించి భర్తీ చేయడానికి చర్యలు మొదలుపెట్టారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేల ఖాళీల్లో దాదాపు 23 వేల ఉద్యోగాలను నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా ఖాళీలు గుర్తించగా, వాటిలో 2,600 నేరుగా నియామకాలకు వస్తాయి. వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలుంటే, వాటిలో 2,400 డీఆర్‌ పోస్టులు. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు 26 వేల వరకు పోస్టులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరో మూడు వేల పోస్టులను ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలున్నాయి. వీటిలో 1,820 నేరుగా నియామకాలకు కేటాయించారు. 24 ప్రభుత్వ విభాగాలు, ముఖ్యంగా పాఠశాల విద్యా శాఖ, తమ వద్ద ఉన్న మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను ఇంకా ఖరారు చేయలేదు. దీనివల్ల దాదాపు 30 వేల వరకు పాఠశాల విద్యలో బోధన, బోధనేతర ఖాళీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు 10 వేల పోస్టులు సిద్ధంగా ఉన్నాయి. ఏపీఎస్పీ, ఇంటర్మీడియట్‌ విద్య, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్, ఎన్‌సీసీ, ప్రింటింగ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ వంటి అనేక విభాగాలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు.