తెలంగాణ విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌ నగరం సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఈ అసాధారణ చలి తీవ్రతకు ప్రధాన కారణం ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న శీతల గాలులేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ చలి ప్రభావం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉంది.ఆదివారం నమోదైన ప్రాంతాలలో ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలు ముందున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ (యూ)లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఇది రాష్ట్రంలోనే ఈ ఏడాది అత్యంత కనిష్టంగా రికార్డయింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఈ చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌, జగిత్యాల, మెదక్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట జిల్లాల్లో కూడా ఆదివారం రాత్రి 8 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత సగటు 12.1 డిగ్రీలుగా ఉంది, కానీ ఈ ఏడాది దానికంటే దాదాపు 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం.గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ చలి తీవ్రత వేగంగా పెరిగింది, ముఖ్యంగా శివారు ప్రాంతాలలో అధిక చలి నమోదైంది. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఈ సీజన్‌లో గ్రేటర్‌ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.తెలంగాణలో రాబోయే రెండు రోజులలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, జిల్లాల్లో శీతలగాలులు వీచే అవకాశం ఉండటంతో, వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సగటున 8.6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.