వివాహమై ఏళ్లు గడుస్తున్నా.. తల్లిదండ్రులు కాలేకపోతున్నామనే బాధ. బంధువులు, ఇరుగు పొరుగువారి మాటలను దాటుకొని ఐవీఎఫ్ (IVF) చికిత్స ద్వారా తమ జీవితంలో కొత్త వెలుగును చూశారా దంపతులు. ఇక వారి ఆనందానికి హద్దులు లేవు. భార్య కడుపులో కవల పిల్లలు పెరుగుతున్నారు. పుట్టబోయే పిల్లల భవిష్యత్తును ఊహించుకుంటూ.. వారి కోసం చిన్న చిన్న కలలు కంటూ ఆనందంలో మునిగి తేలారు. ఆ ఆనందం అమాంతం ఆవిరైపోయింది. ఆశలన్నీ అడియాశలుగా మారిపోయాయి. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న భార్యకు ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో ఆందోళనతో ఆసుపత్రికి వెళ్లారు. కడుపులోనే కవలలు చనిపోయారని డాక్టర్లు చెప్పటంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మెరుగైన చికిత్స అందిస్తున్న సమయంలోనే భార్య కన్నుమూసింది. తనను వీడి ప్రియమైన భార్య, కవల పిల్లలు శాశ్వతంగా దూరమయ్యారనే నిజాన్ని భర్త భరించలేకపోయాడు. కన్నీళ్లు కూడా ఇంకిపోయి, గుండె నిండా దుఃఖంతో ఇంటికి చేరుకున్నాడు. 'ఇక నువ్వు లేని జీవితం నాకొద్దు' అని లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకు చెందిన విజయ్, శ్రావ్య దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. విజయ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేస్తూ సమీపంలోని సామ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండేవారు. వివాహం జరిగి ఏళ్లు గడిచినా పిల్లలు కలగకపోవడంతో.. తల్లిదండ్రులు కావాలనే బలమైన కోరికతో ఈ దంపతులు ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లలను కనేందుకు నిర్ణయించుకున్నారు. చివరకు శ్రావ్య గర్భం దాల్చడం, అదీ కవల పిల్లలు కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు.శ్రావ్య ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో ఆమె తన తల్లితో కలిసి అత్తాపూర్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో శ్రావ్య కడుపులో ఉన్న కవల పిల్లలు ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. కవల పిల్లల మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంతలోన, శ్రావ్య ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్ ప్రాంతంలోని మైత్రి అనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే శ్రావ్య కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు.ఎంతో ఆశగా ఎదురుచూసిన కవల పిల్లలు, ఆ తర్వాత ప్రాణంగా ప్రేమించిన భార్య కన్నుమూయడంతో భర్త విజయ్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. భార్య మరణంతో కుంగిపోయి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, శ్రావ్య మృతదేహాన్ని అప్పగించేందుకు సంతకం కోసం ఆసుపత్రి సిబ్బంది విజయ్‌కి పదేపదే ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా విజయ్ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే సామ ఎన్‌క్లేవ్‌లోని వారి ఇంటికి వెళ్లి చూశారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నిండిపోయింది.పిల్లలు, భార్య మరణం కలిగించిన మానసిక వేదన, ఒంటరితనం విజయ్‌ను ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కవల పిల్లలు, వారి తల్లి, ఆ తర్వాత తండ్రి... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం శంషాబాద్ ప్రాంతంలో తీవ్ర విషాదాన్నిసృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.