వచ్చే ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని.. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆచితూచి వ్యవహరిస్తోంది. వరుస సిరీస్‌ల నేపథ్యంలో.. కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే.. సౌతాఫ్రికాతో స్వదేశంలో త్వరలో ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్ ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గిల్ సేన ఓటమి పాలైంది. నవంబర్ 22న గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత.. నవంబర్ 30న 3 మ్యాచ్‌ల ODI సిరీస్ ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యాకు.. ఇటీవల సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో గాయమైంది. తొడ కండరాల గాయంతో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్టోబర్‌- నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ-20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతానికి గాయం అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ.. వర్క్ లోడ్ ఎక్కువ పడుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 'హార్దిక్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. తొడ కండరాల గాయం బారిన పడిన క్రమంలో.. ఇప్పుడు క్రమంగా వర్క్ లోడ్ పెంచాల్సి ఉంటుంది. వెంటనే 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడటం రిస్క్ అవుతుంది. టీ-20 ప్రపంచ కప్ వరకు హార్దిక్ కేవలం టీ-20లపైనే దృష్టి సారిస్తాడు.' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 26న సయ్యత్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. బరోడా తరఫున ఆడి పాండ్యా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరగనున్న టీ-20 సిరీస్‌ల్లో ఆడే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ డిసెంబర్ 9న ప్రారంభం కానుండగా.. తర్వాత జనవరిలో కివీస్‌తో టీ-20 సిరీస్ జరగనుంది. బుమ్రాకు రెస్ట్..మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా కూడా జట్టు ప్రధాన ఆటగాడు కాబట్టి.. రాబోయే టీ-20 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండాలన్న కారణంతో రెస్ట్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీ-20 ప్రపంచకప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ బోర్డుకు కీలకంగా మారనుంది. దీంతో రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇదే సమయంలో.. తర్వాతి ప్రధాన టోర్నీ టీ-20 ప్రపంచకప్పే కాబట్టి ప్రస్తుతానికి వన్డే మ్యాచ్‌లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. టీ-20 వరల్డ్ కప్, ఐపీఎల్ తర్వాతే.. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నాహకాలు ప్రారంభించనున్నారు.