హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. ఏళ్ల నాటి ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఎలివేటెడ్ కారిడార్‌ ప్రారంభం ఫిక్స్

Wait 5 sec.

హైదరాబాద్‌లోని కీలకమైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల పూర్తిపై తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ కారిడార్‌ను 2026 దసరా పండుగ నాటికి తప్పకుండా పూర్తి చేసి.. ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను.. సంబంధిత నిర్మాణ సంస్థను మంత్రి కోమటిరె్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణీత గడువులో పూర్తి అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉప్పల్-వరంగల్ మార్గంలో గుంతల కారణంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. వెంటనే బీటీ రోడ్డు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను, ఆ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థను ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మేడారం జాతర సమయానికి.. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణించే భక్తుల సౌకర్యార్థం.. బీటీ రోడ్డు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి తెలిపారు. మొత్తం 5.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో ఇప్పటికే 1.5 కిలోమీటర్లు పూర్తి అయినట్లు మంత్రి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం ఉప్పల్-వరంగల్ మార్గంలో రోడ్డు గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయంపై ఇటీవల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వెంటనే బీటీ రోడ్డు (బిటుమినస్ రోడ్డు) పనులు చేపట్టాలని ఆదేశించగా.. ఆ మేరకు అధికారులు పనులను కూడా ప్రారంభించారు. ఉప్పల్ - వరంగల్ మార్గంలో ప్రయాణించే వారికి.. ముఖ్యంగా మేడారం జాతరకు వెళ్లే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఏడాది దసరా నాటికి ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రారంభించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ కారిడార్ పూర్తయితే తూర్పు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.