టీమిండియా ఉమెన్స్ క్రికెటర్, స్టార్ బ్యాటర్ వివాహ వేడుకలో షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాసేపట్లో పెళ్లి అనగా తండ్రి శ్రీనివాస్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో పెళ్లి అర్ధంతరంగా వాయిదా పడింది. మధ్యాహ్న సమయంలో ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అయ్యి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అదే సమయంలో మరొక బ్యాడ్ న్యూస్ కూడా తెలిసింది. స్మృతి మంధాన లవర్, పెళ్లి కొడుకు పలాష్ ముచ్చల్ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా క్షీణించింది. దాంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించారు. నేషనల్ మీడియా సమాచారం మేరకు పలాష్‌కు వైరల్ ఇన్ఫెక్షన్‌తో పాటు తీవ్రమైన డైజషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పరస్థితి అంత ప్రమాదకరం కాకపోవడంతో వైద్య చికిత్స అనంతరం వెంటనే డిశ్చార్జ్ అయ్యి, ఆ తర్వాత వెడ్డింగ్ హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. స్మృతి తండ్రి ఆరోగ్యంపై కుటుంబ వైద్యుడు డాక్టర్ నమన షా వివరాలు వెల్లడించారు. “మధ్యాహ్నం 1:30 సమయంలో శ్రీనివాస్ మంధానాకు ఎడమ వైపు ఛాతిలో నొప్పి వచ్చింది. దీనిని వైద్యపరంగా ‘అంజైనా’ అని అంటాం. వెంటనే అంబులెన్స్ పంపించి ఆస్పత్రికి తరలించాం. ఈసీజీతో పాటు ఇతర వైద్య పరీక్షల్లో కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగినట్లు గుర్తించాం. అందువల్ల నిరంతర పర్యవేక్షణ అవసరం” అని ఆయన తెలిపారు. పరిస్థితి మరింత క్లిష్టమైతే యాంజియోగ్రఫీ అవసరమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణంలో వారం రోజులుగా స్మృతి - పలాష్ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఈ వేడుక ఆదివారం జరగాల్సి ఉంది. ఊహించని సంఘటనలతో ఒక్కసారిగా వివాహం ఆగిపోయింది. శ్రీనివాస్ మంధానా కోలుకున్న తర్వాత కొత్త వివాహ తేదీని ఖరారు చేస్తారు. ఈ పరిస్థితులు అన్నీ చక్కబడే వరకూ వివాహం గురించి ఆలోచించబోమని స్మృతి మంధాన కుటుంబ సభ్యులు తెలిపారు.