తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. వైద్యారోగ్య శాఖలో ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే మరో 10 వేల కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్లకు ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజల, ముఖ్యంగా పేదల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండేళ్ల కాలంలోనే వైద్యారోగ్య శాఖలో ఇప్పటివరకు 9,572 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి వెల్లడించారు. దీనికి అదనంగా మరో 7,267 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం వివిధ దశల్లో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రానున్న రోజుల్లో మరో 10 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. 1,257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని రికార్డు సమయంలో పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.వైద్య వ్యవస్థలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్రను మంత్రి కొనియాడారు. గతంలో లక్షణాలను బట్టి వైద్యం చేసేవారు, కానీ నేడు ఖచ్చితమైన రోగ నిర్ధారణ తర్వాతే చికిత్స జరుగుతోందని చెప్పారు. డాక్టర్లకు ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే ప్రామాణికమని.. వారు వ్యవస్థకు కళ్లు, చెవుల వంటి వారని అభివర్ణించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వైద్య విద్యార్థుల హాస్టల్ వసతి కోసం రూ.200 కోట్లు కేటాయించామని, త్వరలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను 'సెకండరీ హెల్త్ కేర్'గా మార్చబోతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని, నూతన హెల్త్ పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తన నియోజకవర్గం హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య రంగంలో తీసుకొస్తున్న మార్పులను ఆయన అభినందించారు.