సరకు రవాణా వాహనాల పన్ను విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వాహనాల యజమానులకు ఊరట కల్పించేలా.. పన్ను చెల్లింపు విధానంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఏళ్లుగా ఉన్న త్రైమాసిక పన్ను చెల్లింపు విధానానికి స్వస్తి పలికి.. కొత్త విధానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.కొత్త పన్ను చెల్లింపు విధానం ప్రకారం.. కొత్తగా కొనుగోలు చేసే సరకు రవాణా వాహనాలకు 3 నెలలకోసారి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.ఒకేసారి జీవితకాల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం సరికొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. గూడ్స్ వాహనం ధరలో 7.5 శాతాన్ని జీవితకాల పన్ను రూపంలో వసూలు చేస్తారు. కాగా ప్రస్తుతం ఉన్న పన్ను చెల్లింపు విధానం వల్ల పన్ను ఎగవేత ఎక్కువవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 25 శాతం గూడ్స్ వాహనాలకు పన్నులు చెల్లించడం లేదట. దీంతో వాహనాలు ఆపి పన్నులు గురించి చెక్ చేయాల్సి వస్తోంది. అందుకే వాహనం కొనుగోలు చేసేటప్పుడే ట్యాక్స్ వసూలు చేస్తే.. పన్ను ఎగవేతకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ జరిగేలా కొత్త విధానం ఉండనున్నట్లు సమాచారం. గూడ్స్ వాహనాల యజమానులకు ఊరట..!గూడ్స్ వాహనాలకు దాదాపు 15 సంతత్సరాల కాలపరిమితి ఉంటుంది. తుక్కు కింద మార్చేయాల్సిందే. అయితే ఈ కాలంలో ప్రతి మూడు నెలలకోసారి పన్నులు కట్టడం వాహనదారులకు భారంగా మారుతోంది. ఒకవేళ పన్ను చెల్లింపు మర్చిపోతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇక అధికారులు కూడా వాహనాలను పన్నులు చెల్లించాలని ఆపుతుంటారు. కొత్త ట్యాక్స్ విధానం వల్ల ఈ ఇబ్బందులేవీ ఉండవు.కాగా, పాత వాహనాలకు ఈ కొత్త విధానం వర్తించదు. కొత్తగా కొనుగోలు చేసే గూడ్స్ వాహనాలను మాత్రమే ఈ విధానం కిందకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వానికి వచ్చే జీవిత కాల పన్ను పెరుగుతుంది. అయితే ప్రారంభంలో ఎక్కువగా పన్ను వసూలు అయినా.. తర్వాతి కాలంలో మూడు నెలలకోసారి వచ్చే పన్ను ఆగిపోతుంది. అయినా పన్ను ఎగవేతలకు శాశ్వతంగా చెక్ పడుతుంది.