ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మొత్తంలో 50 శాతం కడితే చాలు.. నాలుగు రోజులే ఛాన్స్, త్వరపడండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన లేఅవుట్లలోని ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి (LRS) దరఖాస్తు చేసుకోవడానికి గడువు దగ్గరపడింది. క్రమబద్ధీకరణకు మరో నాలుగు రోజులే సమయం ఉంది. అనధికార లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఉన్నవారు వాటిని అధికారికం చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను 'ప్లాట్ల క్రమబద్ధీకరణ' అంటారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 23 తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు.ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి చూస్తే, ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అధికారులు సుమారు 9 వేల ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఅవుట్లు ఉన్నాయని అంచనా వేశారు. అయితే, కేవలం 6 వేల ఎకరాలకు 52,470 మంది దరఖాస్తులు వచ్చాయి. అంటే, మరో 3 వేల ఎకరాల విస్తీర్ణంలోని లేఅవుట్లకు దరఖాస్తులు రావాల్సి ఉంది. ప్రజలు గడువును పొడిగించాలని కోరుతున్నారు. తమకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు దీనిపై త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.అనుమతులు లేకుండా వేసిన కొన్న ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం 'లేఔట్ క్రమబద్ధీకరణ పథకం' (LRS)ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 75 వేల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి రుసుముల రూపంలో సుమారు రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి 2025 జులై 26న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాదు ఛార్జీల్లో 50% రాయితీ ప్రకటించింది. ఈ నెల 23వ తేదీలోగా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే వారికి ఈ అవకాశం కల్పించారు. ప్లాట్ మొత్తం విలువలో 14% బదులు 7% చెల్లిస్తే సరిపోతుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాలకు దూరంగా ఉన్న లే అవుట్లలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అయితే గడువులోగా ప్లాట్లను క్రమబద్ధీకరించుకోకపోతే, ఓపెన్ స్పేస్ ఛార్జీలు 14% చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఛార్జీలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ రోజు ఉన్న విలువల ఆధారంగా లెక్కించి కట్టాలి. అంతేకాకుండా, బెటర్‌మెంట్‌ ఛార్జీలు, ఇతర రుసుములపై కూడా అదనంగా అపరాధ రుసుములు విధించే అవకాశం ఉంది. ఈ అన్ని చెల్లింపులు చేసినా, ఆ లేఅవుట్‌లో కనీసం కొన్ని ప్లాట్లైనా ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించబడి ఉండాలి. లేకపోతే, ఆ లేఅవుట్‌ను అనుమతుల్లేనిదిగా భావించి, క్రమబద్ధీకరణకు, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు పురపాలక, నగరపాలక సంస్థలు అనుమతి ఇవ్వవు.ప్లాట్ల యజమానుల చిరునామాలు తెలియకపోవడం వల్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్లు ఇప్పుడు పనిచేయడం లేదు. తాత్కాలిక చిరునామాల్లోనూ యజమానులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కారణాల వల్ల, కొన్ని లేఅవుట్లలోని అన్ని ప్లాట్లను క్రమబద్ధీకరించడం అధికారులకు సవాలుగా మారింది. ముఖ్యంగా, నగరాలకు దూరంగా ఉన్న లేఅవుట్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అంతేకాదు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తుల్లోనూ పూర్తి సమాచారం ఉండటం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో అధికారులు వాటిని పక్కనపెట్టారు.. ఆ సమాచారం కోసం దరఖాస్తుదారులను సంప్రదిస్తున్నారు.