నకిలీ పురుగు మందుల వినియోగం, విక్రయాలపై కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. నకిలీ పురుగు మందులు వాడినా, అమ్మినా అలాంటి వారికి రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దేశంలో పురుగు మందుల విక్రయం రోజురోజుకు పెరుగుతోంది. అమ్మకం, వాడకం విచ్చలవిడిగా మారింది. అయితే చాలా సార్లు నకిలీ పురుగు మందులు వినియోగించడం వల్ల తెగుళ్లు నాశనం అయ్యే బదులు.. పంటలే నాశనం అవుతున్నాయి. పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. కొన్నిసార్లు నష్టాలను తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అయితే ఇన్ని నష్టాలకు కారకులైన వారు మాత్రం సులభంగా తప్పించుకుంటున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి, నకిలీ పురుగు మందుల బెడదను అరికట్టడానికి, రైతులకు మేలు చేయడానికి 'పురుగు మందుల నిర్వహణ బిల్లు, 2025' (Pesticides Management Bill, 2025) ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లు ద్వారా పురుగు మందుల వాడకాన్ని మరింత కఠినతరం చేయడంతో పాటు, సాంకేతికతను ఉపయోగించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముసాయిదాపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించారు. ఫిబ్రవరి 4 లోపు నిర్దేశించిన ఫార్మాట్‌లో వాటిని సమర్పించాలి. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఈ ముసాయిదాను రూపొందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 'కీటక నాశిని చట్టం, 1968', 'కీటక నాశిని నియమాలు, 1971' స్థానంలో ఈ కొత్త బిల్లు రానుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నియంత్రణ వ్యవస్థను మార్చడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.మార్కెట్లో నకిలీ, నాసిరకం పురుగు మందులు అమ్ముతున్నారని రైతుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. వీటివల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. గత ఏడాది జూన్ నెలలో, ఒక నెల రోజుల పాటు నిర్వహించిన రైతు సంప్రదింపుల కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పలు రాష్ట్రాల రైతులతో మాట్లాడారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల వల్ల పంట దిగుబడి తగ్గి, తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ 'పురుగు మందుల నిర్వహణ బిల్లు, 2025' రైతులకు మేలు చేసేలా రూపొందించబడింది. ఇందులో రైతులకు పారదర్శకత, నాణ్యతను గుర్తించే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనివల్ల రైతులకు మెరుగైన సేవలు అందుతాయని, వారి సాగు ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ముసాయిదాలో సంస్కరణలకు దారితీసే అనేక చర్యలు ఉన్నాయి. టెక్నాలజీ, డిజిటల్ ప్రక్రియలను ఉపయోగించి నియంత్రణ పనులను సులభతరం చేయాలని ప్రతిపాదించారు. నకిలీ పురుగు మందులపై కఠినమైన నిబంధనలు విధిస్తూ, భారీ జరిమానాలు అమలు చేయడం ద్వారా వాటి విక్రయాలను నిరోధించాలని ప్రభుత్వం చూస్తోంది.అంతేకాకుండా, రాష్ట్ర స్థాయి అధికారులు చిన్న చిన్న తప్పులకు కూడా భారీగా జరిమానాలు విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పురుగు మందుల నిర్వహణలో పరిపాలనాపరమైన నియంత్రణను, మొత్తం వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించారు. రైతుల వద్దకు నాణ్యమైన మందులు మాత్రమే చేరేలా పరీక్షా ప్రయోగశాలలకు గుర్తింపును తప్పనిసరి చేయాలని కూడా ఈ బిల్లు సూచిస్తోంది.ఇటీవల గుజరాత్‌లో నకిలీ వ్యవసాయ రసాయనాలను తయారు చేసి, పంపిణీ చేస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు గుర్తించాయి. ఇటువంటి చర్యలు రైతుల జీవనోపాధికి, వినియోగదారుల భద్రతకు మరియు భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయి.