మ్యాచ్ అనంతరం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత్ ఓటమి తర్వాత స్టేడియంలో అభిమానులు గట్టిగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ క్లిప్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సహా భారత ఆటగాళ్లు ప్రేక్షకుల నినాదాలు విని ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు గంభీర్‌పై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.ఈ ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. అంతేకాదు, భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం గమనార్హం. ఈ ఫలితం తర్వాత సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇది తొలిసారి కాదు. ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌ల నుంచే కొంతమంది అభిమానులు గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనలు కనిపించాయి. అయితే ఇప్పుడు సిరీస్ ఓటమితో ఆ అసంతృప్తి మరింత పెరిగింది. టీ20 ఫార్మాట్‌లో గంభీర్ మంచి ఫలితాలు సాధించినా వన్డేలు, టెస్టుల్లో నిరాశపరిచిన ఫలితాలు అతనిపై ఒత్తిడి పెంచాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయం సాధించినప్పటికీ, 2024లో స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాజాగా వన్డే సిరీస్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓటమి అతని కోచింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తింది.గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జూలై 2024 నుంచి భారత్ 20 వన్డేల్లో 12 మ్యాచ్‌లు గెలిచింది. కానీ శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓటములు అతని రికార్డుపై మచ్చగా మారాయి. ముఖ్యంగా స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండోర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన, రాబోయే రోజుల్లో టీమిండియా కోచింగ్ వ్యవస్థపై చర్చను మరింత వేడెక్కించేలా కనిపిస్తోంది. సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కూడా గ్రౌండ్‌లోనే గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు. అప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఫ్యాన్స్‌ని వారించాడు. మళ్లీ ఇప్పుడు న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.