IT Employees: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అందరి దృష్టిలో ఏసీ గదులు, లక్షల జీతాలు, విలాసవంతమైన జీవితం. కానీ, ఆ గ్లామర్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగి ఒకరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన కళ్లకు కడుతోంది. ఐదేళ్ల క్రితం ఉన్న జీతం పెరగాల్సింది పోయి, మరింత తగ్గిపోవడం చూస్తుంటే ఐటీ రంగంలో దిగువ స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తాను సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తుంటే తన జీతాన్ని పెంచడానికి బదులుగా తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఇతర కంపెనీకి మారిపోదామన్నా అది తనకు అడ్డంకిగా మారిపోయిందని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని రాసుకొచ్చారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. వైరల్ అవుతున్న 'కన్నీటి' పోస్ట్2019లో టీసీఎస్‌లో చేరినప్పుడు తన జీతం రూ. 25,000 అని, కానీ సుమారు ఐదున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు తన చేతికి అందుతున్న జీతం కేవలం రూ. 22,800 మాత్రమేనని అతను వాపోయాడు. అనుభవం పెరిగే కొద్దీ జీతం రెట్టింపు అవ్వాల్సింది పోయి, ఐదేళ్ల తర్వాత కూడా ప్రారంభం కంటే తక్కువ జీతానికి పనిచేయాల్సి రావడంపై ఆ ఉద్యోగి తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.'నేను 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు నెలవారీ జీతం రూ.25,000 ఉండగా 5 ఏళ్ల సర్వీస్ తర్వాత చేతికి అందుతోది రూ.22,800 మాత్రమే. గతంలో నాకు లో పర్ఫార్మేన్స్ బ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత నా పనితీరు మెరుగుపరుచుకున్నా ఎలాంటి అప్రైజల్ ఇవ్వలేదు. నేను ఉద్యోగం మారదామని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇంటర్వ్యూ పూర్తి చేసినా హెచ్ఆర్‌తో సంభాషణ సందర్భంగా సమస్య వస్తోంది. నా శాలరీ పే స్లిప్స్ చూసిన తర్వాత వారు మాట్లాడడం మానేస్తున్నారు.' అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఐటీ ఉద్యోగుల అప్రైజల్, పే గ్రోత్, ఐటీలో ఉన్న సవాళ్లను ఈ పోస్ట్ ప్రతిబింబిస్తోంది. టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?చాలా ఐటీ కంపెనీలు ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ లేదా కంపెనీ లాభాల పేరుతో వేరియబుల్ పే లో కోత విధిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించి ఆఫీస్‌కు రావాలని టీసీఎస్ కఠిన నిబంధనలు పెట్టింది. ఆఫీస్‌కు రాని వారి జీతాల్లో కోత విధిస్తామని ఇప్పటికే హెచ్చరించింది. ఐటీ రంగంలో ఫ్రెషర్ల జీతాలు గత 10-15 ఏళ్లుగా దాదాపు ఒకేలా (3.5 - 4 LPA) ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులతో పోలిస్తే ఈ జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు ఐటీ దిగ్గజాలు వేల కోట్ల లాభాలను ప్రకటిస్తుంటే, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల బతుకులు మాత్రం అగమ్యగోచరంగా మారుతున్నాయి. లేఆఫ్‌ల భయంతో ఉద్యోగులు జీతం తక్కువైనా మౌనంగా భరిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అద్దెలు, జీవన వ్యయం రెట్టింపు అయ్యాయి. కానీ ఐదేళ్ల అనుభవం ఉన్నా రూ. 22 వేలతో బతకడం అసాధ్యమని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భయం, మరోవైపు తక్కువ జీతాలు ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి.