రూ.202 కోట్లతో మరో లక్ష ఎకరాల్లో ఆ పంట సాగు.. ఎకరాకు రూ.55 వేల ఆదాయం

Wait 5 sec.

పాడేరు ఏజెన్సీలో కాఫీ సాగు ప్రతి ఏటా విస్తరిస్తోంది. ఇక్కడ సాగు చేసే కాఫీకి మంచి డిమాండ్ కూడా వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో మరో లక్ష ఎకరాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని చింతపల్లి, అరకు వ్యాలీ, పాడేరు ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో భారీ సంఖ్యలో మరో లక్ష ఎకరాల్లో ఈ పంటను విస్తరించనున్నారు.ఇది కాకుండా కాఫీ పంట పునరుద్ధరణ కింద 75 వేల ఎకరాల్లో సాగును చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 202 కోట్లు. కాఫీ సాగులో ప్రస్తుతం దేశంలో కర్ణాటక, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2031 నాటికి సాగును విస్తరింపజేసి, తద్వారా రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం.కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం లక్ష ఎకరాల సాగులో.. 60 వేల ఎకరాల్లో షేడ్ ప్లాంటేషన్ విధానంలో కాఫీ సాగు చేయనున్నారు. మిగిలిన 40 వేల ఎకరాల్లో కూడా ఇదే పద్ధతిలో కాఫీ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తారు. కారణం కాఫీ పంటకు సూర్యరశ్మి నేరుగా తాకకూడదు, నీడలోనే సాగు చేయాలి. అందుకే ఈ షేడ్ ప్లాంటేషన్ విధానాన్ని ఎంచుకున్నారు.దీంతో పాటు పాడేరు ఏజెన్సీ పరిధిలో రానున్న ఐదేళ్లలో 75 వేల ఎకరాల్లో కాఫీ పంటను పునరుద్ధరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తి తగ్గి ఆదాయం పడిపోయిన రైతుల పొలాల్లో ఈ పునరుద్ధరణ చర్యలు చేపడతారు. ఏటా 15 వేల ఎకరాల్లో పునరుద్ధరణ చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.కాఫీ సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎకరాకు 1000 కాఫీ మొక్కలను ఉచితంగా అందిస్తుంది. ఒక రైతు గరిష్ఠంగా 5 ఎకరాల వరకు కాఫీ సాగు చేసుకోవచ్చు. మొక్కలు నాటిన ఏడేళ్లకు కాఫీ ఉత్పత్తి మొదలవుతుంది. ఆ తర్వాత ఎకరాకు రూ. 25 వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆదాయం 40-50 ఏళ్ల పాటు స్థిరంగా ఉంటుంది. కాఫీతో పాటు అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు.మిరియాల సాగును ప్రోత్సహించేందుకు ఎకరాకు 100-200 మిరియాల మొక్కలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మిరియాల ఉత్పత్తి కూడా ఏడేళ్లకు మొదలవుతుంది. అప్పుడు ఎకరాకు రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుంది. ఏపుగా పెరిగిన సిల్వర్ ఓక్ చెట్ల నీడలో మిరియాలను అంతర పంటగా సాగు చేయవచ్చు.కాఫీ రైతులకు మరింత మద్దతిచ్చేందుకు జీకే వీధి, జి. మడుగులలో రూ. 7 కోట్ల వ్యయంతో 2 ఎకో కాఫీ పల్పింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అల్యూమినియం నిచ్చెనలు, బేబీ పల్పర్స్, టార్పాలిన్లు వంటివి అందిస్తారు. అంతేకాకుండా, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో మాకవరపాలెంలో ఒక కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.