తెలంగాణ విప్లవం రాబోతోంది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని చేరువ చేస్తూ.. అమ్ములపొదిలోకి ఏకంగా 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం ఈ-డ్రైవ్' పథకం కింద ఈ బస్సులను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపింది. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే కాకుండా.. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం ఈ 2 వేల బస్సులను వివిధ రకాలుగా వర్గీకరించింది. ఇందులో లో-ఫ్లోర్, సెమీ లో-ఫ్లోర్, స్టాండర్డ్ ఏసీ, మినీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు సులభంగా బస్సు ఎక్కేందుకు వీలుగా 'లో-ఫ్లోర్' బస్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు. తయారీ సంస్థలు ఈ బస్సులను దశలవారీగా సరఫరా చేయనున్నాయి. ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే.. బస్సు రకాన్ని బట్టి కిలోమీటరుకు కనిష్ఠంగా రూ. 54.91 నుండి గరిష్ఠంగా రూ. 66.90 వరకు అద్దెను ఖరారు చేసినట్లు సమాచారం.హైదరాబాద్‌లోని పాతబస్తీ వంటి అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ప్రయాణం ఇప్పుడు సులభతరం కానుంది. ఇక్కడి ఇరుకైన రహదారులపై భారీ బస్సులు తిరగడం సవాలుగా మారిన నేపథ్యంలో.. ఆర్టీసీ తొలిసారిగా ఎలక్ట్రిక్ మినీ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ మినీ బస్సులు గల్లీల్లో కూడా సులభంగా ప్రయాణించగలవు. దీనివల్ల పాతబస్తీ వాసులకు రవాణా ఇబ్బందులు తప్పుతాయి. వీటితో పాటు, పొరుగు జిల్లాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం చౌటుప్పల్-దిల్‌సుఖ్‌నగర్ వంటి కీలక మార్గాల్లో స్టాండర్డ్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.మెట్రో ప్రయాణికుల కోసం 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'ని మెరుగుపరిచేందుకు ఈ బస్సులను ఫీడర్ సర్వీసులుగా వినియోగించనున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మినీ బస్సులు ఎంతో ఉపయోగపడతాయి. డీజిల్ బస్సుల స్థానంలో ఇవి రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం బస్సుల్లో ఉన్న విపరీతమైన రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సుఖమయమైన, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందించనున్నారు.