Share Price: దేశంలో కార్పొరేట్ కంపెనీల ఫలితాల సీజన్ నడుస్తోందని చెప్పొచ్చు. ముందుగా భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫలితాల్ని ప్రకటించింది. ఆ తర్వాత వరుసగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో కూడా ఫలితాల్ని ప్రకటించాయి. చివరగా ఐదో అతిపెద్ద ఐటీ సంస్థ టెక్ మహీంద్రా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్ని శుక్రవారం రోజు (జనవరి 16) ప్రకటించింది. . టీసీఎస్, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో అన్నింటి నికర లాభం తగ్గింది. కానీ టెక్ మహీంద్రా లాభాలు మాత్రం అంతకుముందుతో పోలిస్తే పెరిగాయి. దీంతో ఈసారి ఇది ట్రెండ్ మార్చేసిందని చెప్పొచ్చు. సమీక్షా త్రైమాసికంలో టెక్ మహీంద్రా నికర లాభం రూ. 1122 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నికర లాభం రూ. 983.20 కోట్లుగా ఉండగా.. ఈసారి 14.11 శాతం పెరిగింది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం కూడా రూ. 13,286 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి ఇప్పుడు రూ. 14,393 కోట్లకు చేరుకుంది. ఇక జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 1194 కోట్లుగా ఉండగా.. ఆదాయం రూ. 13,994 కోట్లుగా ఉంది. ఇక్కడ లాభం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో స్వల్పంగా తగ్గింది. ఆదాయం మాత్రం ఇక్కడ కూడా పెరిగింది. కొత్త కార్మిక చట్టాల అమలుకు అనుగుణంగా మూడో త్రైమాసికంలో అదనంగా 30 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 270 కోట్ల వరకు) కేటాయించినట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. ఇంకా సమీక్షా త్రైమాసికంలో టెక్ మహీంద్రా 1.096 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లు దక్కించుకున్నట్లు పేర్కొంది. టెక్ మహీంద్రా ఒక్కటే క్యూ3లో లాభాల్ని పెంచుకుంది. మిగతా కంపెనీల విషయానికి వస్తే టీసీఎస్ నికర లాభం 13.9 శాతం తగ్గి రూ. 10,657 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ నికర లాభం 2.2 శాతం తగ్గి రూ. 6,654 కోట్లుగా ఉంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభం కూడా 11.2 శాతం తగ్గి రూ. 4076 కోట్లుగా నమోదు చేసింది. . ఇక ఫలితాలకు ముందు శుక్రవారం రోజు టెక్ మహీంద్రా షేరు దూసుకెళ్లింది. ఏకంగా 5.26 శాతం పెరిగి రూ. 1672 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 1680.70 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.