తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైంది పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగకు తెలుగు లోగిళ్లు అల్లుళ్లు, కుమార్తెలు, ఇతర బంధువులతో కళకళలాడుతూ ఉంటాయి. కుమార్తెకు కొత్తగా పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండుగ సంక్రాంతి అయితే, ఇక ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులు చేసే హంగామా మామూలుగా ఉండదు. కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేయడం కోసం రకరకాల వంటలతో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తారు.ఇక కొత్త అల్లుళ్లకు మర్యాద చేయడంలో గోదావరి జిల్లాల వాసుల తర్వాతే ఎవరైనా. ఇప్పటి వరకు వందల వంటకాలతో కొత్త అల్లుడికి మర్యాదలు చేసిన అత్తామామల గురించి విన్నాం. ఈ క్రమంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా 1,574 వంటకాలతో విందు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ దంపతులు కొత్త అల్లుడికి 1500కు పైగా వంటకాలతో విందు ఏర్పాటు చేసి 'నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అనేలా రికార్డు క్రియేట్ చేశారు.ఈ బాహుబలి విందు వివరాల్లోకి వెళ్తే.. మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన విజ్జెపు వెంకటరత్నం, సుశీల దంపతుల కుమార్తె కీర్తిశ్రీకి గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పి.గన్నవరం మండలం, ముంగండ గ్రామానికి చెందిన సాయి శరత్‌కు ఇచ్చి శ్రీకీర్తికి వివాహం చేశారు. వీరి పెళ్లయిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో, అల్లుడు సాయి శరత్‌కు భారీ స్థాయిలో విందు ఏర్పాటు చేయాలని వెంకటరత్నం దంపతులు భావించారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి 1,574 రకాల ఆహార పదార్థాలతో గురువారం బాహుబలి స్థాయిలో భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి స్వీట్లు, పిండివంటలు, రకరకాల పండ్లు, కూల్‌డ్రింక్స్ వంటి వాటితో అల్లుడికి భారీ విందు ఇచ్చారు.ఇదే కాకుండా మొగల్తూరు పంచాయతీ నల్లంవారితోటలో కొత్త అల్లుడికి 260 వంటకాలు, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో 1,116 రకాల పిండివంటలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. అలాగే, కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కూడా కొత్త అల్లుడికి 271 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 150 రకాల వంటకాలను అరిటాకుల్లో వడ్డించి అల్లుడిని ఆశ్చర్యపరిచారు.