ఆసియాకప్‌ 2025లో భారత్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలై, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో అవమానానికి గురైన పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించింది. ఇందుకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఉపయోగించుకోవాలని అనుకుంది. నిబంధనల ఉల్లంఘనలకు సహకరించినందుకు అతడిపై చర్యలు తీసుకోవాలని.. పీసీబీ.. ఐసీసీ వద్ద పట్టుబట్టింది. లేకపోతే తాము ఆసియాకప్‌ను బాయ్‌కాట్ చేస్తామని బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో షేక్ హ్యాండ్ వివాదంపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. అయితే పాకిస్థాన్ చేసిన ఫిర్యాదును ఐసీసీ లైట్ తీసుకుంది. ఇందులో చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్ జై షా కు సైతం భయపడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆసియాకప్‌ను బహిష్కరిస్తే.. కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జై షా స్పష్టం చేశారట. ఇందుకు ఐసీసీ కార్యవర్గం కూడా ఆమోదం తెలిపిందట. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణతో తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ ఆంక్షలను తట్టుకునే స్థితిలో లేదు. ఈ పరిస్థితుల్లో ఆసియాకప్‌ను బహిష్కరించే విషయంలో మొండిగా వెళ్తే.. తమకే నష్టమని ఆ బోర్డు భావించింది. అందుకే బాయ్‌కాట్ చేస్తామనే డిమాండ్‌పై యూ టర్న్ తీసుకుంది. చేసేదేం లేక.. బుధవారం యూఏఈతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక ఐసీసీలో, ఆసియాకప్‌లో తమ మాట నెగ్గించుకోలేకపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. సొంత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. షేక్ హ్యాండ్ వివాదాన్ని సరిగా డీల్ చేయలేకపోయారనే ఆరోపణలతో పీసీబీలోని పలువురు అధికారులను తొలగించాలని భావిస్తోంది. ఇక ఆసియాకప్‌లో పాకిస్థాన్ సూపర్‌-4కు అర్హత సాధించాలంటే.. యూఏఈతో మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఒకవేళ ఆ జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. మూడు మ్యాచ్‌లలో ఒకే విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరువు మరింత దిగజారినట్లే. బుధవారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్‌-ఏ నుంచి భారత్ ఇప్పటికే సూపర్‌-4కు చేరుకోవడం గమనార్హం.