జార్జియాలో భారతీయ పర్యాటకుల పట్ల అమెరికా అధికారులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాము అర్మేనియా నుంచి జార్జియాలోకి వెళ్తుండగా.. సడఖాలో సరిహద్దులు వద్ద 56 మంది భారతీయులను అధికారులు అడ్డుకుని ఐదు గంటల పాటు నిర్బంధించారని ఆవేదనకు గురైంది. ఈ మేరకు తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సరైన పత్రాలు, వీసా ఉన్నా నిర్బంధించి దారుణంగా అవమానించారని ధ్రువీ పటేల్ అనే మహిళ వాపోయారు. ‘‘ఎముకలు కొరికే చలిలో ఆహారం, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకుండా 5 గంటల పాటు నిర్బంధించారు’’ అని ఆమె ఆరోపించారు. అంతేకాదు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2 గంటల పాటు తమ పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుని, రోడ్డుపక్క ఫుట్‌పౌత్‌లపైనే పశువుల్లా కూర్చోబెట్టారని ధ్రువీ పటేల్ తెలిపారు. అలాగే, తమను నేరస్థుల మాదిరిగా వీడియోలు తీయడానికి ప్రయత్నించారు కానీ, మేము అడ్డుకున్నామని చెప్పారు. తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించకుండానే తప్పుడు వీసాలని తేల్చారని, వారి ప్రవర్తన అత్యంత హోయమైందని, ఆమోదయోగ్యం కానిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పోస్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ... భారత్ ఈ విషయంలో బలమైన వైఖరి అవలంభించాలని ఆమె కోరారు. అర్మేనియా, జార్జియా మధ్య సరిహద్దుల్లోని సడఖాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారతీయులను చూసే విధానం సిగ్గుచేటు, అంగీకరించలేనిది అని ధ్రువి తన పోస్ట్‌ను ముగించారు. దీనిపై స్పందించిన నెటిజన్లు.. తమకు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు పెట్టారు. ఓ నెటిజన్.. చాలాకాలంగా ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తరుచూ ఇటువంటి ఘటనలు జరుగుతుంటే.. అక్కడకు ఎందుకు వెళ్లాలని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇది జాత్యంహకార చర్య అని కొందరు మండిపడుతూ.. జార్జియా ప్రభుత్వ జాత్యంహకార ధోరణి గురించి పాత వార్తా కథనాలను షేర్ చేశారు.2019లో జార్జియాకు వెళ్లిన ఓ పర్యాటకుడు.. రష్యా నుంచి వెళ్లే ముందు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యిందని, చివరకు మాకు అనుమతి ఇచ్చారని చెప్పాడు. కానీ, చాలా ఏళ్లుగా భారతీయులకు సమస్యలు సృష్టిస్తున్నారని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నాడు. కాగా, దీనిపై ఇప్పటి వరకూ విదేశాంగ శాఖ అధికారంగా స్పందించలేదు. కాగా, కొద్ది రోజుల కిందట జార్జియాలోనే దక్షిణ కొరియా పౌరులను అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ 450 మందిని అరెస్ట్ చేసి వారికి సంకెళ్లు వేసిన వ్యవహారంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.