అభిషేక్ శర్మ విధ్వంసం, గిల్ మెరుపులు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

Wait 5 sec.

ఆసియాకప్‌ 2025లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్‌-4 చేరిన టీమిండియా.. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత పాక్‌ను 171/5కే పరిమితం చేసింది. అనంతరం , శుభ్‌మన్ గిల్ విధ్వంసంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సూపర్‌-4 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది.తొలి బంతికే సిక్సర్‌..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ పాక్ బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేశారు. ముఖ్యంగా అభిషేక్.. పాక్ బౌలర్లను షేక్ చేశాడు. షహీన్ అఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ఆ తర్వాత కూడా అతడు అదే జోరు కొనసాగించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా రాణించలేకపోయిన గిల్ సైతం సత్తా చాటాడు.ఓపెనర్లు ఇద్దరు బౌండరీల వర్షం కురిపించడంతో టీమిండియా పవర్‌ ప్లే ముగిసే సరికి.. 69/0తో నిలిచింది. విజయానికి బలమైన పునాది వేసుకుంది. తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 105 రన్స్ జోడించిన తర్వాత గిల్ (28 బంతుల్లో 47 రన్స్‌) ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు చేరుకుని జోరుమీదున్న అభిషేక్.. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 39 బంతుల్లో 74 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి.సంజూ శాంసన్ (17 బంతుల్లో 13 రన్స్‌) కూడా పెవిలియన్ చేరినా.. తిలక్ వర్మ (30), హార్దిక్ పాండ్యా (7) లాంఛనం పూర్తి చేశారు. మొత్తంగా పాక్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌.. ఓపెనింగ్ బ్యాటర్ ఫర్హాన్ (45 బంతుల్లో 58 రన్స్‌) హాఫ్ సెంచరీతో సవాల్ విసిరే స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 171/5 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్ విజయంతో ఆసియాకప్‌ సూపర్‌-4 పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానానికి చేరింది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.