ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే నియోజకవర్గానికి తండ్రీకూతుళ్లు ఇంఛార్జ్‌లు అయ్యారు. అయితే తండ్రీకూతుళ్లే అయినా సరే వేర్వేరు పార్టీల నుంచి ఇంఛార్జ్‌ల హోదాల్లో ఉన్నారు. ఈ ఆసక్తికర పరిణామం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగింది. రాజోలు టీడీపీ ఇంఛార్జ్‌గా గొల్లపల్లి అమూల్యను అధిష్టానం నియమించింది.. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. మాజీ మంత్రి, ప్రస్తుత రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ కూతురు. దీంతో రాజోలు నియోజకవర్గంలో తండ్రి (వైఎస్సార్‌సీపీ) వర్సెస్ కూతురు (టీటీడీపీ) అన్నట్లుగా రాజకీయాలు కొనసాగనున్నాయి. గొల్లపల్లి సూర్యారావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నచి పోటీచేసి ఓడిపోయారు. సూర్యారావు 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. రోజోలు నుంచి 2019లో మరోసారి టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.2024లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరి రాజోలు నుంచి పోటీచేసి జనసేన పార్టీ అభ్యర్థి దేవ వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే ఆయన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాజోలు సీటు కోసం టీడీపీ, జనసేన పార్టీలు పోటీపడ్డాయి.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం కావడంతో ఆ సీటు తమకు కావాలని ఆ పార్టీ కోరింది. గొల్లపల్లి సూర్యారావు కూడా టీడీపీ నుంచి పోటీచేయాలని ప్రయత్నించారు. కానీ జనసేనపార్టీ ఆ టికెట్ కోసం పట్టుబట్టడంతో సూర్యారావుకు టికెట్ లేదని తేలింది. ఈ క్రమంలో ఆయన టీటీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాజోలు నుంచి పోటీచేసి గెలుపు దక్కలేదు. ప్రస్తుతం రాజోలు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా సూర్యారావు ఉండగా.. తాజాగా టీడీపీ కూడా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యను నియమించడం చర్చనీయాంశంగా మారింది. తాజా నియామకంతో రాజోలు నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.