మన దేశంలో నగరం పేరు చెప్పగానే.. సిలికాన్ వ్యాలీ అని గుర్తుకు వస్తుంది. అయితే అదే సమయంలో బెంగళూరు అనగానే.. ట్రాఫిక్ సమస్యలు కూడా గుర్తుకు వస్తాయి. బెంగళూరులో ఉండే టెక్ ఉద్యోగులు.. తాము నగరంలోని ట్రాఫిక్‌ను తట్టుకోలేకపోతున్నామంటూ.. పదే పదే సోషల్ మీడియా వేదికగా తమ అవస్థలను వెళ్లగక్కుతూనే ఉన్నారు. రోజులో కనీసం 3, 4 గంటలు ట్రాఫిక్‌లోనే తమ విలువైన సమయం వృథా అవుతోందని ఇప్పటికే చాలా మంది బెంగళూరు నగరవాసులు చెబుతూనే ఉన్నారు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి వాహనాల మధ్య చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా.. తగ్గడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ టెకీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్కిల్ అనే కంపెనీలో పనిచేసే ఒక టెక్ ఉద్యోగి తన వ్యక్తిగత అనుభవాన్ని రెడ్డిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా వివరించారు. అయితే తనకు ఏడాదికి రూ. 28 లక్షల ఆదాయం ఉందని.. అందులో రూ. 6.5 లక్షలను ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆదే సమయంలో రోజువారీ ఖర్చులపై ఏడాదికి రూ. 1.4 లక్షల వరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) గా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు పన్నులు కలిపితే.. ఆ ఉద్యోగి.. ఏడాది మొత్తంలో 3 నెలలకు పైగా దేశం కోసం పనిచేస్తున్నట్లేనని వెల్లడించారు. ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ కలిపితే సంవత్సరానికి రూ.7 లక్షలను పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు.. తాను నివసించే ప్రదేశానికి.. తన ఆఫీస్ కేవలం 14 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ.. సాధారణంగా 30 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ బెంగళూరు నగరంలో ఉండే ట్రాఫిక్ కారణంగా.. అది కాస్తా 3 రెట్లు అయి 90 నిమిషాలు పడుతుందని తెలిపారు. ఈ ట్రాఫిక్ కారణంగానే తన జీవితంలో ఏడాదికి అదనంగా 2.5 నెలల సమయం వృథా అవుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, మెరుగైన మౌలిక వసతుల కోసం తాను పన్నులు చెల్లిస్తున్నప్పటికీ.. తాను కట్టే పన్నులు సరైన చోట ఖర్చు కావడం లేదని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.అయితే ఆ టెకీ చేసిన పోస్టుపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. బెంగళూరులో పనిచేసే ఇంజనీర్‌ను విదేశాలకు పంపిస్తే.. స్వచ్ఛమైన గాలి, ట్రాఫిక్ లేని వాతావరణంలో వారు 20 శాతం ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తారని ఒక నెటిజన్ తెలిపారు. బెంగళూరు పౌరుల నుంచి పాలు పిండి, ఇతర అనవసరమైన పథకాలకు నిధులు సమకూరుస్తున్నారని.. నగరానికి ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని మరో నెటిజన్ తీవ్రంగా విమర్శించారు. తాజా ఘటనతో మరోసారి బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.