ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.70 వేల కోట్ల ప్రాజెక్టు.. నవంబర్‌లో పనులు ప్రారంభం.!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్, నిప్పన్‌ స్టీల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 70 వేల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉక్కు కర్మాగారం ద్వారా ఏడాదికి 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట వద్ద 2,200 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. అయితే నిర్మాణ పనులను నవంబర్‌లో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి బుధవారం వెల్లడించారు. బిజినెస్ ఫోరమ్ యూకేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బదులుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తోందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ, డేటా సిటీలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. మరోవైపు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని వివరించారు.టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకరా 99 పైసలకే భూములు కేటాయించిందని నారా లోకేష్ గుర్తు చేశారు. ఏపీలో యువనాయకత్వం ఉందన్న నారా లోకేష్.. మంత్రివర్గంలోని 25 మంది మంత్రులలో 17 మంది కొత్తవారేనని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్ అని.. తామంతా ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. దక్షిణాసియాలోనే తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో ఏర్పాటు కానుందని నారా లోకేష్ వివరించారు. అలాగే విశాఖలో డేటా సిటీ నిర్మాణం ద్వారా కేబుల్స్ ల్యాండ్ అవుతాయని. మూడేళ్లలో అవి పూర్తవుతాయని నారా లో కేష్ వివరించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్న నారా లోకేష్.. రాబోయే రోజుల్లో ఎన్నో ప్రముఖ కంపెనీలు ఏపీకి రానున్నాయని తెలిపారు.