ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రూయిజ్‌షిప్.. టికెట్ ధర రూ.7.3 కోట్లు, 40 దేశాల్లో 140 రాత్రులు

Wait 5 sec.

షిప్‌లో వెళ్లి సముద్రాలు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండదు. కానీ చాలా మంది ధనవంతులు, వ్యాపారవేత్తలు ఇలాంటి విలాసవంతమైన నౌకల్లో.. సముద్రయానం చేస్తూ ఉంటారు. ఇందుకోసం కొన్ని కంపెనీలు క్రూయిజ్ షిప్‌ టూర్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ క్రూయిజ్ షిప్‌లలో ప్రయాణం చేసే ఒక్కొక్కరి నుంచి.. టికెట్ కింద భారీ మొత్తం వసూలు చేస్తారు. ఇక ఈ క్రూయిజ్ షిప్‌లో అన్నీ లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలు అన్నింటినీ కల్పిస్తారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ నౌక యాత్రకు సంబంధించిన ప్యాకేజీని ప్రకటించారు. రీజెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ యాత్రకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్ అనే పేరుతో ఈ లగ్జరీ యాత్రను 2027లో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ యాత్రలో ఒక్కో టికెట్ ధర.. రూ.80 లక్షల నుంచి రూ.7.3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే ఇప్పటివరకు అత్యంత ఎక్కువ ధర కలిగిన క్రూయిజ్ యాత్ర అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ యాత్ర 140 రాత్రులు కొనసాగనుందని.. 40 దేశాలు, 71 పోర్టులను కవర్ చేస్తూ ప్రయాణం చేయనున్నట్లు తెలిపింది.రీజెంట్ సెవెన్ సీస్ సంస్థ ఈ వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్ యాత్రలో భాగంగా అత్యంత ఖరీదైన రీజెంట్ సూట్‌లో టికెట్ ధర అత్యధికంగా రూ.7.3 కోట్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ లగ్జరీ సూట్‌లో ప్రయాణించేవారికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించనున్నారు. ప్రతి పోర్టులో ప్రయాణికుల కోసం స్పెషల్‌గా ఒక కారు.. దానికి ఒక డ్రైవర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక సూట్ లోపలే స్పా సహా అన్ని సదుపాయాలు ఉంటాయి. 4 వేల చదరపు అడుగుల విశాలమైన ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. వీటన్నింటితోపాటు విమాన ప్రయాణం, లగ్జరీ హోటల్‌లో బస, సేవలు, ప్రీమియం డ్రింక్స్, వైఫై, 24 గంటల రూమ్ సర్వీస్ వంటి సేవలు అందిస్తారు.ఈ క్రూయిజ్ షిప్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణించనుంది. ఈ మార్గంలో ఈ క్రూయిజ్ షిప్ ఆరు ఖండాలను దాటనుంది. మొత్తంగా 35,668 నాటికల్ మైళ్లు అంటే 66,064 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మయామి నుంచి బయల్దేరి.. లాస్ ఏంజిల్స్, సిడ్నీ, సింగపూర్, సహా భారత్‌లోని ముఖ్యమైన నగరాలైన ముంబై, మంగళూరు, కొచ్చి, గోవా వంటి నగరాల్లో ఈ క్రూయిజ్ షిప్ ఆగనుంది. ఇక ఇదే రీజెంట్ సెవెన్ సీస్ సంస్థ.. వచ్చే ఏడాది మరో క్రూయిజ్ షిప్‌ను కూడా ప్రారంభించనుంది. ఇందులో అత్యంత ఖరీదైన స్కైవ్యూ రీజెంట్ సూట్ ఉంటుంది. దీని ధర ఒక్కో రాత్రికి రూ. 20 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.