హీటెక్కించిన భారత్ - పాక్ మ్యాచ్.. ఈ సారి ఏకంగా గ్రౌండ్‌లోనే గొడవకి!

Wait 5 sec.

మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ఆసియా కప్ మరోసారి చూయించింది. హ్యాండ్ షేక్ వివాదం తర్వాత జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠత రేపింది. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ సమయంలో పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే విధానంతో మరింత హీటెక్కింది. పాక్ బౌలర్ల ఘాటు వ్యాఖ్యలకు టీమిండియా తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పింది. భారత్ బ్యాటింగ్ ఆరంభించిన మొదటి బంతి నుంచే పాకిస్తాన్ బౌలర్లు రెచ్చగొట్టేలా ప్రయత్నించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మని టార్గెట్ చేసిన పాక్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, దగ్గరకొచ్చి మరీ గొడవకు దిగారు. తొలి బంతికే సిక్సర్ బాదిన .. షాహీన్ షా ఏదో అనడంతో ఛల్ అంటూ తీసిపడేశాడు. ఆ తర్వాత హారీశ్ రౌఫ్ ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తూ తన మాటలతో రెచ్చగొట్టాడు. పవర్ ప్లేలో హారీశ్ రౌఫ్ వేసిన ఓవర్‌‌లో శుభమన్ గిల్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అదే సమయంలో నాన్ స్ట్రయిక్‌లో ఉన్న అభిషేక్‌తో హారీశ్ రౌఫ్ వాగ్వాదానికి దిగాడు. దాంతో అభిషేక్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాడు. అంపైర్లు మధ్యలోకి వచ్చి వారిద్దరిని వారించడంతో గొడవ సద్దుమణిగింది.ఆసియా కప్ 2025 సూపర్ 4లో భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ప్రత్యర్థి పాక్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. టీమిండియా ఫీల్డింగ్ మిస్టేక్‌తో క్యాచ్‌లు మిస్ చేయడంతో పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇచ్చిన భారీ టార్గెట్‌ ఛేజింగ్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలోనే ఏకంగా 105 పరుగులు నమోదు చేశారు. శుభమన్ గిల్ 28 బంతుల్లో 8 ఫోర్లతో 47 పరుగులు చేయగా, ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 17 బంతుల్లో కేవలం 13 పరుగులు చేసి నిరాశ పరిచాడు. ఆఖర్లో తిలక్ వర్మ 19 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో భారత్ 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.