విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు కన్నులపండుగగా వేడుకలు నిర్వహిస్తారు.. అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శమివ్వనున్నారు.దేశ, విదేశాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలిరానున్నారు. అయితే విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి. వీటిని దసరా ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారి విగ్రహానికి, కల్యాణమూర్తులకు ఈ మంగళసూత్రాలు అలంకరిస్తారు. వీటిని ఉత్సవాల్లో మాత్రమే బయటకు తీస్తారు. మిగతా రోజుల్లో బ్యాంకు లాకరులో భద్రంగా ఉంచుతారు. దుర్గమ్మ దసరా వేడుకల్లో 11 రోజులు 11 రూపాల్లో దర్శనమిస్తారు. ఒక్కో అలంకారానికి తగిన ఆభరణాలతో పాటు మంగళసూత్రాలు ధరింపజేస్తారు. భక్తులు అమ్మవారిని కొంగుబంగారంగా భావిస్తారు. విజయవాడలో సోమవారం తెల్లవారుజాము నుంచి కనకదుర్గమ్మ దర్శనం మొదలైంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్నదాన కేంద్రం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం దగ్గర, కుమ్మరిపాలెం దగ్గర క్యూలైన్లు ఉన్నాయి. భక్తులు క్యూలైన్లలో రెండు కిలోమీటర్లు నడిచి కొండపైకి వెళ్తున్నారు. ఈ మేరకు భక్తులు ఘాట్‌రోడ్డు మీదుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దర్శనం తర్వాత శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగిపోతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ సక్రమంగా జరుగుతున్నాయి.వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. మొదటి రోజు కాకుండా మిగిలిన 10 రోజులు ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఈసారి VVIPలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుంది. మిగతా ఎవరికీ అనుమతి లేదు. రూ.300 టికెట్ తీసుకున్న వారికి బంగారు వాకిలి దర్శనం లభిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 6.30 నుండి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతులు జరుగుతాయి. ఆ సమయంలో గంటసేపు దర్శనాలు నిలిపివేస్తారు. అధికారులు భక్తులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. VVIPలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఉదయం 7 నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు వీరికి దర్శనం కల్పిస్తారు. ఈ సమయాల్లోనే రావాలని అధికారులు కోరుతున్నారు. నగరోత్సవం రోజు సాయంత్రం 4 గంటలకు కన్నుల పండుగగా నగరోత్సవం నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ లక్ష్మీశ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించేందుకు సాంకేతికతను ఉపయోగించారు. భక్తులు తమ అభిప్రాయాలను, సమస్యలను తెలియజేయడానికి క్యూఆర్ (QR) కోడ్‌లను ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, దర్శనం క్యూలైన్లలో ఈ సదుపాయం ఉంది. సుమారు 1.8 కి.మీ మేర క్యూలైన్ ఉంది. అక్కడ క్యూఆర్ (QR) కోడ్‌ ఫీడ్‌బ్యాక్ పోస్టర్‌లను పెట్టారు. ప్రతి 100 మీటర్లకు ఈ పోస్టర్‌లు ఉంటాయి. క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి, ఉత్సవ ఏర్పాట్లపై అభిప్రాయాలు చెప్పవచ్చు. సమస్యలను కూడా తెలియజేయవచ్చు అని కలెక్టర్ చెప్పారు. క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. "ఏమైనా అసౌకర్యాలున్నాయా?" అని అడుగుతుంది. దానికి సమాధానం ఇచ్చి, సబ్మిట్ చేయాలి. వాయిస్ రికార్డ్ ద్వారా కూడా సమస్యను చెప్పవచ్చు. "88855 92974 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను చెప్పవచ్చు" అని కలెక్టర్ తెలిపారు. సాంకేతికత సహాయంతో సామాన్య భక్తులకు కూడా మంచి అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.