భారత్‌పై కోల్డ్‌వార్ మొదలుపెట్టిన అమెరికా..? స్నేహం ముసుగు తొలగిపోతోందా..!? చైనాను వదిలేసి మనల్ని ఎందుకు?

Wait 5 sec.

ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకున్న వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. కాస్త ముందు, వెనుక అంతే. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగిన బ్రిటన్.. క్రమంగా కుచించుకు పోయింది. భూమండలం మొత్తం తన గుప్పిట్లో ఉండాలనుకున్న హిట్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి కోరికే ఇప్పుడు అమెరికాను నడిపిస్తోంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా తనకు తానే ప్రపంచంపై ఆధిపత్య హక్కులు రాసుకుంది. పట్టు కోల్పోకుండా ఉండటం కోసం.. ఆర్థికంగా, దౌత్య పరంగా ఒత్తిళ్లు తీసుకొస్తూ ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో తనకు పోటీగా వస్తున్న వారిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఇరకాటంలో పెడుతోంది. అందులో భారత్ ఒకటి.తాము చెప్పినట్లు వినడం లేదని, మిత్ర దేశం అని కూడా చూడకుండా భారత్ పట్ల అమెరికా ఇష్టా రీతిన వ్యవహరిస్తోంది. టారిఫ్‌లు విధిస్తూ ఒత్తిడి తెస్తోంది. భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అగ్రరాజ్యం అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. మన శత్రు దేశాలకు సహాయం చేయడం, విదేశాల్లో భారత్ ప్రయోజనాలను దెబ్బకొట్టడం వంటి చర్యలకు పాల్పడుతోంది. దీంతో భారత్‌తో అమెరికా కోల్డ్‌వార్‌కు దిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా.. సోవియెట్ యూనియన్‌తో కోల్డ్‌వార్‌‌లో ఎలాంటి వ్యూహాలను అనుసరించింది? భారత్‌తో కూడా అలాంటి విధానాలే అవలంబిస్తోందా? భారత్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎందుకు పెంచుతోంది? అనే వివరాలు తెలుసుకుందాం. కోల్డ్‌వార్‌లో అమెరికా వ్యూహాలు.. ప్రత్యర్థి దారులన్నీ మూసేసి ఉక్కిరిబిక్కిరి చేయడం అమెరికా వ్యూహం. తద్వారా నిస్సహాయంగా ఉన్న వాళ్లను తన దారికి తెచ్చుకుంటుంది. లేదా నాశనం చేస్తుంది. కోల్డ్‌వార్‌ సమయంలో కూడా.. దక్షిణాసియాలో సోవియట్ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని దేశాలకు అమెరికా మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు మిలిటరీ, ఆర్థిక, దౌత్య పరంగా మద్దతు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. అంతేకాకుండా సోవియట్ ప్రభావానికి అడ్డుకట్ట వేయడానికి వాణిజ్య మార్గాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా వివిధ దేశాల్లో ఎయిర్‌ బేస్‌లు, పోర్టులు, ట్రాన్స్‌పోర్ట్ కారిడార్లను నిర్మించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 80కిపైగా దేశాల్లో.. చిన్న డ్రోన్‌ హబ్‌ల నుంచి పెద్ద ఎయిర్‌ బేస్‌ల వరకూ 850 ఓవర్సీస్ బేస్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, ఆయా దేశాలను దౌత్య పరంగా, ఆర్థికంగా.. ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేస్తుంది. మిగతా దేశాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రయోజనాలనే చూసుకుంటుంది అమెరికా. ఒక దేశాన్ని ఎదగనీయకుండా.. మిగతా దేశాలను ఉసిగొల్పుతుంది. తద్వారా తనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ రాకుండా చూసుకుంటుంది. ఆసియాలో చైనాకు కౌంటర్ వెయిట్‌గా భారత్‌ను చూసింది. ఇక భారత్‌ను కట్టడి చేయడానికి పాకిస్థాన్‌ను ఉసిగొల్పుతోంది.భారత్‌పై అవే వ్యూహాలు అమలు చేస్తున్న ట్రంప్! గత కొద్ది కాలంగా అమెరికా.. భారత్‌తో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు అవకాశం ఇస్తోంది. గతంలో సోవియట్ యూనియన్‌తో కోల్డ్‌వార్ సమయంలో అమెరికా అనుసరించిన స్క్రిప్ట్‌నే ఇప్పుడు ట్రంప్ చదువుతున్నారని అంటున్నారు నిపుణులు.తాజాగా హెచ్‌1బీ వీసాలపై ఫీజు విపరీతంగా పెంచింది యూఎస్. ఈ ఫీజును 1000 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు చేసింది. అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసాదారుల్లో 71 శాతం భారతీయులు, భారత సంతతి వారే కావడం గమనార్హం. జులైలో భారత్‌పై 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్. అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం కలిసి 50 శాతానికి టారిఫ్స్ పెంచారు. రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొంటున్న చైనాపై టారిఫ్స్‌ వేసే ధైర్యం అమెరికా చేయడం లేదు. చైనా తిరిగి టారిఫ్‌లు విధించగలగడం, చాలా విధాలుగా చైనాపై అమెరికా ఆధారపడి ఉండటం దీనికి కారణం. చైనాను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ట్రంప్.. ఆ కోపాన్ని కూడా భారత్‌పై చూపుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొనొద్దని భారత్‌పై ఒత్తిడి తెస్తోంది అమెరికా. లేకుంటే ఇంకా సుంకాలు విధిస్తామంటోంది. భారత్ వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను ఓపెన్ చేయాలని అగ్రరాజ్యం డిమాండ్ చేస్తోంది. భారత్‌ను కవ్వించడానికి పాకిస్థాన్‍కు మద్దతు ఇస్తున్నారు ట్రంప్. అందులో భాగంగా పాకిస్థాన్‌లో ఆయిల్ రిజర్వ్‌లను అభివృద్ధి చేయడానికి జులైలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గతంలో ఇరాన్‌లోని చాహబార్ పోర్టులో భారత కార్యకలాపాలకు ఆంక్షల నుంచి మినహాయించిన ట్రంప్.. ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ట్రంప్.. భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలపై దెబ్బకొడుతున్నారు. 2018 నుంచి చాహబార్ పోర్టులోని షాహిద్ బెహెస్తీ టెర్మినల్‌ను భారత్ ఆపరేట్ చేస్తోంది. భారత్ ఇస్తున్న కౌంటర్ ఏంటి?అమెరికా బెదిరింపులకు మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చేందుకే భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. ఆ దేశ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు ఎండగడుతోంది. ట్రంప్ టారిఫ్‌లు సమర్థించుకోలేనివని ముఖం మీదే చెప్పేసింది. ట్రంప్ మాటల్ని పట్టించుకోకుండా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచింది. తమ సార్వభౌమత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరనే సందేశం ఇచ్చింది. ఇక మీదట విదేశాలపై ఆధారపడకుండా, ఆత్మనిర్భరంగా ఉండేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వాణిజ్య పరంగా ఎగుమతులైనా, దిగుమతులైనా ఒకే దేశంపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈయూ, యూకే వంటి వాటితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని మార్కెట్‌ను విస్తరించాలని ప్రయత్నిస్తోంది. దౌత్యపరంగా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది భారత్. అమెరికాకు భాగస్వామిగా ఉంటూనే.. రష్యా, చైనాతో సంబంధాలను పెంచుకుంటోంది. అమెరికాతో వాణిజ్య చర్చలకు సై అంటూనే.. లక్ష్మణ రేఖ గీస్తోంది. ఇలా వ్యూహాత్మక స్వతంత్రతను పాటిస్తూ.. భారత్ ఎప్పుడూ అమెరికాకు లొంగదనే గట్టి సందేశాన్ని ఇస్తోంది. అమెరికాకు అప్పులు గుదిబండలా మారాయి. పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న ఆధిపత్యం.. బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ చేస్తాయనే భయం వైట్ హౌస్‌లో ఆందోళనలు పెంచుతున్నాయి. మోదీ తన ఫ్రెండ్ కాబట్టి.. తాను ఏం చెబితే భారత్ అది చేస్తుందనే ట్రంప్ పాచిక పారలేదు. ఆపరేషన్ సింధూర్ ముగించడం వెనుక తాను ఉన్నానని ట్రంప్ ప్రకటించుకున్నా.. మోదీ సర్కారు ఖండించింది. నోబెల్ శాంతి బహుమానం కోసం భారత్ ట్రంప్ పేరును సిఫారసు చేయలేదు. ఇవన్నీ ట్రంప్‌కు వ్యక్తిగతంగా కోపం తెప్పించిన అంశాలని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఇక రష్యాతో మన దోస్తీ కూడా అమెరికాకు ఏమాత్రం గిట్టడం లేదు. మాస్కోకు మస్కా కొట్టి ఇటువైపు వచ్చేయమని అమెరికా ఎంతో కాలంగా భారత్‌కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ అవకాశవాద అమెరికా కోసం ఇండియా మాత్రం చిరకాల స్నేహితుణ్ని వదులుకోవడానికి ఏ దశలోనూ సిద్ధపడలేదు. 145 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌ను ట్రంప్ చాలా తక్కువ అంచనా వేశారు. తన చేతిలో కీలుబొమ్మలా చూడాలని అనుకున్నారు. కానీ భారత్ మెడలు వంచడం సాధ్యం కాదని తెలిసి.. అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే కోల్డ్‌వార్‌ కాలం నాటి వ్యూహాలను భారత్‌పై అమెరికా ప్రయోగిస్తోందనే వాదన వినిపిస్తోంది. తన పెత్తనాన్ని నిలుపుకోవడానికి భారత్ లాంటి ఫ్యూచర్ సూపర్ పవర్‌లను కలుపుకుపోవాల్సింది పోయి.. తన మాట వినకపోతే నలిపేస్తామన్నట్టుగా బెదిరిస్తోంది. భారత్‌ను కాళ్ల బేరానికి రప్పించుకోవడానికి ప్రమాదకరమైన ఆట ఆడుతున్న ట్రంప్.. భస్మాసుర హస్తాన్ని తన తలమీద పెట్టుకుంటున్నారు. ట్రంప్ చర్యలతో కొంత కాలంపాటు భారత్ ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. భారత నాయకత్వం నిబ్బరంగా వ్యవహరించి.. తెలివైన నిర్ణయాలు తీసుకుంటే.. అమెరికా గండాల నుంచి గట్టెక్కడమే మాత్రమే కాదు.. మనల్ని చూసి అమెరికా ఆశ్చర్యపోయే స్థాయికి ఎదగొచ్చు. ఈలోగా అమెరికా మనసు మారి, స్నేహ హస్తం అందించినా.. ఒకప్పటిలా భారత్ నమ్మకాన్ని పొందలేదు.