సూపర్ 4కి అర్హత సాధించిన ఒమన్‌పై అనుకున్న స్థాయిలో రాణించలేదు. బుమ్రా, వరుణ్ చక్రవర్తిని పక్కనబెట్టిన టీమిండియా.. ఆ స్థానాల్లో వచ్చిన అర్షదీప్, హర్షిత్ రాణాలతో సక్సెస్ కాలేకపోయింది. బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా వీక్ అని నిరూపించింది. భారీ స్కోర్‌ని ఛేజ్ చేసే దిశలో ఒమన్ గెలుస్తుందేమో అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. భారత్ పేస్‌ను ఒమన్ జట్టు ఒక ఆట ఆడుకోవడంతో.. టీమిండియా కెప్టెన్ ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. నలుగురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌కు వికెట్లు పడగా.. అక్షర్, శివమ్ దుబే, తిలక్, అభిషేక్ వికెట్లు తీసుకోలేకపోయారు.అబూదాబీ వేదికగా సెప్టెంబర్ 19 రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సూపర్ 4 ముందు తన బ్యాటర్లను ఫామ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను బ్యాటింగ్‌కి పంపకుండా, మిగతా అందరితో ఆడించింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శివమ్ దుబే, శుభమన్ గిల్ విఫలం కాగా.. హార్దిక్ పాండ్యా బ్యాడ్ లక్‌గా రనౌట్ అయ్యాడు. ఒమన్ బౌలర్లు షా ఫైజల్, జితెన్ రామచంద్రన్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారీ స్కోర్‌తో బరిలోకి దిగిన ఒమన్‌ను తక్కువ పరుగులకే టీమిండియా ఆలౌట్ చేస్తుందని అందరూ ఊహించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒమన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్, అమీర్ కలీమ్ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఆ తర్వాత రెండో వికెట్‌కు అమీర్, హమ్మద్ కలిసి ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒమన్ విజయానికి ఆఖరి 20 బంతుల్లో 40 పరుగులు కావాల్సిన సమయంలో వరుస వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించగలిగింది. అమీర్ కలీమ్ 64, హమ్మద్ మీర్జా 51 పరుగులతో రాణించడం విశేషం. ఒమన్ 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సూపర్ 4లో అడుగుపెట్టనున్న సమయంలో బుమ్రా లేకపోతే బౌలింగ్ వీక్ అని టీమిండియా మరోసారి నిరూపించుకుంది.