తిరుమల శ్రీవారి ఆ ఒక్క ట్రస్ట్‌కే రూ.వేల కోట్లు ఉన్నాయి.. ఏడాదికి వడ్డీ ఎంత వస్తుందో తెలుసా!

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ అన్నప్రసాదం అందిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన వస్తోంది అంటున్నారు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్. ఈ కారణంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని తెలిపారు. టీటీడీ ఈవో ని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూ లైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్న ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. ఆయన స్టోర్ రూమ్, వంటశాల, జీడిపప్పు బాక్స్‌లను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్న ప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా మాట్లాడారు.' భక్తుల కోసం అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమై, 1994లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడింది. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చింది.. ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించింది. ప్రతి ఏటా విరాళాలు పెరుగుతున్నాయి, కార్పస్ నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరిగాయి. 2023–24లో కార్పస్ రూ.1854 కోట్లు, 2024–25లో రూ.2127 కోట్లు, 2025 ఆగస్టు వరకు రూ.2263 కోట్లకు చేరింది. వడ్డీలు రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగింది, ప్రస్తుతం వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉంది. రూ.కోటి విరాళాలు ఇచ్చేవారు కూడా పెరిగారు.. 2023–24లో 14 మంది ఉంటే, 2024–25లో 25 మంది, ఈ ఏడాది ఐదు నెలల్లోనే 14 మంది రూ.కోటి పైగా విరాళం అందజేశారు' అని టీటీడీ ఈవో తెలిపారు.'గత నాలుగు దశాబ్దాలుగా టీటీడీ భక్తులకు అందిస్తున్న విశ్వసనీయ సేవలతో భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలపై దృష్టి సారించింది, భక్తుల అభిప్రాయాలు, ఈ-మెయిల్, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్వే, IVRS ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ బోర్డు, సిబ్బందంతా సహకరిస్తున్నారు' అని తెలిపారు.'సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో రిసెప్షన్ విభాగంపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. అంతకు పూర్వం ఆయన అన్న ప్రసాద విభాగ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు' అని టీటీడీ తెలిపింది.