గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ అనంతరం హ్యాండ్ షేక్ వివాదం మరింత దుమారం రేపింది. టీమిండియా హ్యాండ్ షేక్ చేయనందుకు ఐసీసీకి ఫిర్యాదు చేసిన అయితే ఇరు దేశాల మధ్య ఆ హీటు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ - పాక్ ఆటగాళ్లు ఒకే గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయడం పెద్ద హైడ్రామాకి తెరదీసింది. హ్యాండ్ షేక్ వివాదం ఇంకా చల్లారక ముందే పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఐసీసీ అకాడమీకి మంగళవారం చేరుకుంది. అయితే, అదే సమయంలో భారత జట్టు కూడా ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉండటంతో, రెండు జట్ల ఆటగాళ్లు ఒకే స్థలంలో కనిపించారు. ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఒకరిని ఒకరు పలకరించకపోవడం విశేషం. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారంపై ఐసీసీతో ఘర్షణలో ఉన్న పీసీబీ, ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కూడా రద్దు చేస్తూ మొండివైఖరిని కొనసాగిస్తోంది. అయితే మధ్యస్థ పరిష్కారం దిశగా చర్చలు జరగడంతో, బోర్డు చివరకు ఆటగాళ్లను శిక్షణకు పంపింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో కఠినమైన ట్రైనింగ్ కొనసాగిస్తున్న భారత జట్టు ఇంకా మైదానంలో ఉండగానే, పాక్ ఆటగాళ్లు ప్రవేశించారు. కానీ ఎవ్వరూ ఇండియన్ క్యాంప్ వైపు వెళ్లకుండానే తమ ప్రాక్టీస్‌కు పరిమితమయ్యారు. హెడ్ కోచ్ మైక్ హెసన్ పర్యవేక్షణలో నెట్స్ సెషన్ పూర్తి చేశారు. బుధవారం యూఏఈతో తలపడే పాక్ జట్టుకు ఇది మస్ట్ విన్ గేమ్. ఆ పోరులో గెలిస్తే ఆదివారం సూపర్ 4లో మళ్లీ భారత్‌తోనే తలపడాల్సి ఉంటుంది. గత ఆదివారం భారత్ పాక్‌ను వన్ సైడ్‌గా ఓడించింది. అంతకు ముందు భారత సైనిక ఆపరేషన్ ‘సిందూర్’ తరువాత ఇరుజట్ల మధ్య ఇదే తొలి పోరాటం కావడంతో, ఈ సూపర్ 4 సమరం మరింత హై ఓల్టేజ్‌గా మారనుంది.