ఫుల్లుగా తాగి సూప్‌‌‌‌లో టీనేజర్ల మూత్రవిసర్జన.. తల్లిదండ్రులకు రూ. 2.71 కోట్ల జరిమానా విధించిన కోర్టు

Wait 5 sec.

: చైనాలో ఇద్దరు టీనేజర్లు మద్యం మత్తులో చేసిన ఒక అకృత్యం వారి తల్లిదండ్రులకు భారీ జరిమానాను మిగిల్చింది. షాంఘైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు.. వేడి వేడి సూప్‌లో మూత్ర విసర్జన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం కోర్టుకు వెళ్లగా.. విచారణ జరిపిన న్యాయస్థానం రెండు క్యాటరింగ్ కంపెనీలకు నష్ట పరిహారంగా 2.2 మిలియన్ యువాన్‌లు ( భారత కరెన్సీ ప్రకారం రూ. 2,71,78,690) చెల్లించాలని ఆ టీనేజర్ల తల్లిదండ్రులను ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీన ఈ ఘటన జరిగింది. షాంఘై నగరానికి చెందిన 17 ఏళ్ల వయస్సు గల వూ, టాంగ్ అనే ఈ ఇద్దరు యువకులు.. స్థానికంగా ఉన్న ‘హైదిలావో’ అనే హాట్‌పాట్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడే ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో మద్యం సేవించారు. ఫుల్లుగా తాగేసరికి ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న ఈ యువకులు.. టేబుల్‌పైకి ఎక్కి.. హాట్‌పాట్ సూప్‌లో మూత్ర విసర్జన చేశారు. సాంప్రదాయ చైనీస్ హాట్‌పాట్ వంటకాల్లో.. కూరగాయలు, మాంసాన్ని వండటానికి ఈ సూప్‌ను వినియోగిస్తారు. ఇలాంటి సూప్‌లో యువకులు మూత్ర విసర్జన చేయగా.. అక్కడే ఉన్న సీటీసీవీలో ఇదంతా రికార్డు అయింది. నాలుగు రోజుల తర్వాత విషయం గుర్తించిన రెస్టారెంట్ సిబ్బంది వెంటనే కోర్టును ఆశ్రయించింది. ఈక్రమంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం.. వీడియోను ఆధారంగా చేసుకుని సంచలన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా వూ, టాంగ్‌ల తల్లిదండ్రులకు పెద్ద మొత్తంలో జరిమానా వేసింది. కుమారులు చేసిన తప్పుకు గాను తల్లిదండ్రులు 2.2 మిలియన్ యువాన్లు చెల్లించాలని పేర్కొంది. ముఖ్యంగా వంటపాత్రల నష్టం, శుభ్రపరచడానికి 1,30,000 యువాన్లు, అలాగే యాజమాన్యానికి నష్టపరిహారంగా 70,000 యువాన్లను చెల్లించాలని చెప్పింది. మరోవైపు హైదిలావో రెస్టారెండ్ యాజమాన్యం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ మధ్య ఆ రెస్టారెంట్‌కు వచ్చిన 4,000 మందికి పైగా వినియోగదారులకు వారు చెల్లించిన బిల్లు మొత్తానికి అదనంగా మరింత కలిపి తిరిగి చెల్లించారు. తమ రెస్టారెంట్‌లో జరిగిన తప్పుకు నష్టపరిహారంగా దాన్ని చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఇది రెస్టారెంట్ యాజమాన్యం సొంత నిర్ణయం అని, నిందితుల తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఆ ఇద్దరు టీనేజర్లు, వారి తల్లిదండ్రులు నిర్దేశించిన వార్తాపత్రికలలో.. రెస్టారెంట్‌ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతూ ప్రకటనలను ప్రచురించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత యాజమాన్యం రెస్టారెంట్‌లోని అన్ని పాత్రలను ధ్వంసం చేసింది. వాటి స్థానంలో కొత్తవాటిని చేర్చి.. పూర్తిస్థాయిలో రెస్టారెంట్ మొత్తాన్ని శుభ్రపరిచింది. అలాగే క్రిమిసంహారక చర్యలు చేపట్టింది. అలాగే ఆ కలుషితమైన సూప్‌ను ఏ వినియోగదారుడూ తీసుకోలేదని రెస్టారెంట్ అధికారికంగా ప్రకటించింది.రెస్టారెంట్ ప్రత్యేకత..హైదిలావో రెస్టారెంట్ తమ మొదటి శాఖను సిచువాన్‌లోని జిన్‌యాంగ్‌లో ప్రారంభించింది. అప్పటినుంచి ఈ రెస్టారెంట్ వేగంగా విస్తరించింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్ తమ ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్‌కు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఈ రెస్టారెంట్‌కు వచ్చి భోజనం కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లలోని మహిళలకు మానిక్యూర్, పిల్లలకు మిఠాయిలను ఉచితంగా అందజేస్తారు. ఈ ఘటన రెస్టారెంట్ కీర్తిని, వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.