ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏడు విమానాశ్రయాలకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపింది. ఈ మేరకు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రతిపాదించిన భూముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా పంపాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) జిల్లా అధికారులను కోరింది. కొత్తపట్నం మండలంలో విమానాశ్రయం కోసం మొదటి దశలో 798 ఎకరాలు, రెండో దశలో 300 ఎకరాలు, మొత్తం 1,098 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించారు. ఈ భూముల్లో వాన్‌పిక్‌తో పాటు ప్రభుత్వ భూములు, రైతుల నుంచి సేకరించాల్సిన భూములు కూడా ఉన్నాయి.ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జిల్లా అధికారులతో కలిసి విమానాశ్రయం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ఒక ప్రైవేటు సంస్థకు టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో ప్రతిపాదిత భూముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా పంపాలని ఏపీఏడీసీఎల్‌ కోరింది. ఇప్పటికే భూములకు సంబంధించిన జాబితా సిద్ధం చేశామిని.. త్వరలోనే ఆ జాబితాను ఏపీఏడీసీఎల్‌కు పంపనున్నట్లు సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలు విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.ఒంగోలు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం కొత్తపట్నంలోని భూములను పరిశీలించింది. విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని తెలిపింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని ఏపీఏడీసీఎల్‌ ప్రకటన చేసింది. మొదటి విడత భూసేకరణకు రూ.102 కోట్ల పరిహారం అవసరమని అధికారులు అంచనా వేశారు.ప్రకాశం జిల్లాకు వాణిజ్యపరంగా మంచి పేరు ఉంది. ఇక్కడ గ్రానైట్, పొగాకు వంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. చాలామంది ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. రామయ్యపట్నం పోర్టు దగ్గరలో ఉండటం, సముద్ర తీరం కూడా అందుబాటులో ఉండటంతో ఒంగోలులో ఎయిర్‌పోర్టు కట్టాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చాలాసార్లు కలిశారు. సముద్ర తీరం దగ్గరగా ఉండటంతో ఒంగోలులో ఎయిర్‌పోర్టు కట్టడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.