వందే భారత్ రైళ్ల కారణంగా ఆ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పని తిప్పలు.. గంటల తరబడి వెయిటింగ్!

Wait 5 sec.

రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రైలు ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణాలు లభిస్తున్నాయి. కొంచెం టికెట్ ధర ఎక్కువే అయినప్పటికీ.. వందే భారత్ రైళ్లు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడుతున్నారు. ఇది ఒక రకంగా వందే భారత్ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ అయినప్పటికీ.. మిగితా రైళ్లలో ప్రయాణించే వారికి మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వందేభారత్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల రాకపోకల కారణంగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ల రైళ్లను గంటల తరబడి రైల్వే శాఖ అధికారులు ఆపడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వందే భారత్ రైళ్ల రాకపోకల కారణంగా.. రైలును అధికారులు ఆపేయడంతో.. ఈ రైలెక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రయాణించే ఈ గోల్కొండ రైలు.. యాదాద్రి భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట, వరంగల్‌ స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రి భువనగిరి, కాజీపేట జంక్షన్‌ రైలు మార్గంలో విశాఖపట్నం, నాగ్‌పూర్‌లకు వెళ్లే రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం ఒంటి గంట మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే ఈ వందే భారత్ రైళ్లు సికింద్రాబాద్‌ తర్వాత వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఆగుతాయి. ఇందు కోసం కాజీపేట జంక్షన్‌ మీదుగా భువనగిరి నుంచి సికింద్రాబాద్‌కు.. సికింద్రాబాద్‌-భువనగిరి-కాజీపేటల మధ్య ప్రయాణం చేయాల్సిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లను పదే పదే గంటల తరబడి ఆపుతూ ఉన్నారు. దీనివల్ల గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం పెరగడమే కాకుండా.. ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. రైళ్లు ప్రయాణించేందుకు సరిపడా ట్రాకులు ఉన్నప్పటికీ.. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును ఎందుకు నిలిపేస్తున్నారని రైల్వే అధికారులను ప్రయాణికులు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.ఇక భువనగిరి స్టేషన్‌లో 3 ప్లాట్‌ఫారలు ఉండగా.. మొత్తం 26 రైళ్లు మాత్రమే ఆపుతున్నారు. అందులో 8 సూపర్‌ఫాస్ట్‌లు, 4 మెము ప్యాసింజర్లు, 14 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. దక్షిణ్, గౌతమి, సిర్పూర్‌ కాగజ్‌నగర్, భాగ్యనగర్, గోల్కొండ, ఈస్ట్‌కోస్ట్, కృష్ణా, పుష్‌పుల్, కాకతీయ, బీదర్, ఇంటర్‌సిటీ రైళ్లు మాత్రమే భువనగిరిలో ఆపుతున్నారు. వందే భారత్, తెలంగాణ, శాతవాహన, పద్మావతి వంటి రైళ్లు భువనగిరిలో ఆగడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక రైల్వే స్టేషన్‌కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.