ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, డిప్యూటీ సీఎం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రోజున వీరిద్దరి మధ్య కాస్త ఇంట్రస్టింగ్ చర్చ జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అందుబాటులో ఉండటం లేదని.. ఛైర్మన్ పనితీరు బాగోలేదంటూ బొండా ఉమా విమర్శలు గుప్పించారు. ఏవైనా అడిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ చెప్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం బొండా ఉమా వ్యాఖ్యలకు అదే రీతిలో బదులివ్వటంతో వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ బొండా ఉమా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది." అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.."అంటూ బొండా ఉమా ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంవో చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ బొండా ఉమా ట్వీట్ చేశారు. మరోవైపు "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమా.. కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు, సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ, కాలుష్య నియంత్రణ మండలి లో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ""కేవలం వైసీపీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూసేలా చర్యలు తీసుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే విధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తిస్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించనున్నట్లు పవన్ కళ్యా్ణ్ వివరించారు." అంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. బొండా ఉమా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆయన భావించినట్లు తెలిసింది. చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం మీద సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారనేదీ చూడాల్సి ఉంది. మొత్తంగా విపక్షం లేకపోయినప్పటికీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.