తెలంగాణలో అతిపెద్ద పండగ అయిన బతుకమ్మ, దసరా అంటే చాలా మందికి ఎంతో ప్రత్యేకం. ఏడాది పొడవునా పండగలు ఉన్నప్పటికీ.. తెలంగాణలో ఈ పండగలకు ఉండే క్రేజే వేరు. పల్లెలు వదిలేసి పట్నాలకు వలస వెళ్లిన వారు కూడా ఈ పండగలకు సొంతూరికి వచ్చి.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో జరుపుకుంటారు. ఇక ఈ దసరా పండగ సందర్భంగా.. ఉద్యోగులకు ఆ సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి సింగరేణి యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. దసరా పండుగను పురస్కరించుకుని తమ ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రోజున సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగులకు పండగ అడ్వాన్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈ పండగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ. 25 వేల చొప్పున దసరా అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో తాత్కాలిక కార్మికులకు రూ. 12,500 చొప్పున ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఈ మొత్తం డబ్బులను ఈ నెల 23వ తేదీన జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.మరోవైపు.. సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి గుర్తింపు సంఘం యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరిపారు. సింగరేణి లాభాల వాటాను 35 శాతం చెల్లించాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం.