హెచ్-1బీ వీసా ఫీజులు పెంచిన ట్రంప్.. అమెరికా కంపెనీలపై భారం, ఏకంగా రూ.1.23 లక్షల కోట్లు

Wait 5 sec.

హెచ్ 1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇప్పుడు అమెరికా కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు.. వారికి హెచ్-1బీ వీసాలు జారీ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు హెచ్-1బీ వీసాల ఫీజును ట్రంప్ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఆ కంపెనీలకు తలకు మించిన భారం అవుతోందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల విదేశీ ఉద్యోగులను నియమించుకునే అమెరికా టెక్ కంపెనీలకు ఏటా 14 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ. 1.23 లక్షల కోట్ల అదనపు భారం పడనుందని నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలోని కంపెనీల్లో అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే వైట్‌హౌస్ ప్రకటించింది.ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఒక్కొక్కరికీ లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.88 లక్షలు అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగి ఉన్నవారికి ఇది వర్తించదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే లాటరీ విధానం నుంచి హెచ్ 1బీ వీసాదారులకు ఈ కొత్త ఫీజు అమల్లోకి రానుంది. గతేడాది అమెరికాలో 1.41 లక్షల కొత్త హెచ్-1బీ వీసాలు జారీ చేశారు. ఇదే సంఖ్యలో భవిష్యత్తులో కూడా వీసాలు ఇస్తే.. అమెరికాలోని టెక్ కంపెనీలు భారీగా ఫీజులు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది.ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కారణంగా సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలకు.. మరీ ముఖ్యంగా చిన్న స్టార్టప్‌ సంస్థలకు పెద్ద దెబ్బ అని అమెరికాలోని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం స్టార్టప్‌లను దెబ్బతీస్తుందని.. స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ సీఈఓ గ్యారీ టాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో విదేశాల్లోని టెక్ హబ్‌లకు ఇది ఒక పెద్ద వరంగా మారుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగంలో తీవ్ర పోటీ ఉన్న సమయంలో.. టెక్ నిపుణులు తమ పనిని ఇతర దేశాలకు తరలించుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.అయితే హెచ్ 1బీ వీసా ఫీజుల పెంచుతూ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కంపెనీలు, ఉద్యోగులు.. కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని పలువురు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వీసా పథకానికి అడ్మినిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసే అధికారం కార్యనిర్వాహక విభాగానికి ఉన్నప్పటికీ.. లక్ష డాలర్ల ఫీజు విధించడం వారి అధికార పరిధికి మించింది అని హెర్బర్ట్ స్మిత్ ఫ్రీహిల్స్ క్రామర్ సంస్థ లాయర్ మాథ్యూ డన్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని కోర్టులు అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అంచనా వేశారు. అలాగే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా ఎల్-1 వీసాలపై.. టెక్ కంపెనీలు దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.హెచ్ 1బీ వీసాల ఫీజులు భారీ మొత్తంలో పెంచుతూ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు కల్పించేందుకు టెక్ కంపెనీలపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. అయితే.. ఇది ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.